ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాద్రి రామయ్య వెండి ఇటుక మిస్సింగ్.. వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2024, 07:19 PM

తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఒకటి. యాదాద్రి తర్వాత ఎక్కువ మంది భక్తులు రామయ్యను దర్శించుకుంటారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి రామయ్యను ఇతర ఇతర రాష్ట్రాల భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు రామయ్యకు విలువైన కానుకలు అందిస్తుంటారు. అందులో నగదుతో పాటుగా.. బంగారం, వెండి కానుకలు ఉంటాయి. ఈ కానుకలను కొంత మేర ఆలయంలో మిగతాది బ్యాంకు లాకర్లలో భద్ర పరుస్తుంటారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రామయ్య వెండి ఇటుక మాయమైన ఘటన కలకలం రేపింది. ఆరు కిలోల బరువున్న వెండి ఇటుక కనిపించకుండా పోయింది. జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారి తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది.


భక్తులు భద్రాద్రి రామయ్యకు మెుక్కుల్లో భాగంగా వెండిని సమర్పిస్తుంటారు. ఇలా వచ్చిన వెండిలో కొంత మొత్తాన్ని పదేళ్ల కిందట 7 ఇటుకలుగా తయారుచేయించారు. ఒక్కో ఇటుక సుమారు 5-6 కేజీల బరువు ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో తూకం వేస్తుండగా ఇందులో ఓ ఇటుక మిస్సింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లతో పాటు ఆలయంలోని వెండిని దాచే విభాగాన్ని పరిశీలించినా ఇటుక జాడ మాత్రం లభించలేదు. తాజాగా.. దేవస్థానంలో కనిపించకుండా పోయిన వెండి ఇటుకకు సంబంధించిన డబ్బను ఇటీవల రికవరీ చేసినట్లు తెలిసింది. ఆ సమాచారాన్ని దేవాదాయ శాఖకు సైతం పంపినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.


స్వామివారి వెండి వస్తువులు, కానుకలు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించే సిబ్బంది నుంచి దాదాపు రూ.8 లక్షలను రికవరీ చేసి ఆలయ ఖాతాకు జమ చేసినట్లు తెలిసింది. వీరి హయాంలోనే ఇటుక కనిపించలేదన్న కారణంతో వారి వద్ద నుంచే డబ్బును రికవరీ చేసినట్లు సమాచారం. వారి అలసత్వమో, ఇతర కారణమేదైనా ఆ మొత్తాన్ని సిబ్బందే చెల్లించినట్లు తెలిసింది. 2017లో సీతమ్మవారి మంగళ సూత్రం, లక్ష్మణస్వామి బంగారు లాకెట్‌ సైతం కొద్ది రోజుల పాటు కనిపించకుండా పోయాయి. ఆ తర్వాత ఇదే ఆలయంలోని బీరువాలో ఆ ఆభరణాలు లభించాయి. బంగారం, వెండి నిల్వల తాజా వివరాలను ఇప్పటికీ వెల్లడించకపోవటంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు భక్తులు చెబుతున్నారు. రామయ్య సొత్తుకే రక్షణ లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా కానుకల నిర్వహణను పకడ్భందీగా నిర్వహించాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa