సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4న తొక్కిసలాటకు బౌన్సర్ ఆంటోని ప్రధాన కారకుడిగా గుర్తించారు. బౌన్సర్లకు ఆర్గనైజర్గా పని చేస్తున్న ఆంటోనినే ఘటనకు కారకుడిగా పోలీసులు గుర్తించారు. నగరంలో ఎక్కడా ఈవెంట్ జరిగినా.. ఆంటోని బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలోనూ ఆంటోనీనే బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బౌన్సర్ల అత్యుత్సాహం కూడా ఘటనకు ప్రధాన కారణంగా రెండ్రోజుల క్రితం పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బౌన్సర్ ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్ విచారణ పూర్తి..
ఇక తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలు కావటంతో కేసులో అల్లు అర్జున్ పేరును కూడా చేర్చారు. అల్లు అర్జున్ను ఏ11గా చేర్చగా.. పదిరోజుల క్రితం అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. తాజాగా.. ఈ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీసులు దాదాపు రెండు గంటల పాటు బన్నీని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన 50కి పైగా ప్రశ్నలు ఆయన్ను అడిగారు. చిక్కడపల్లి ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని బృందం ఆయన్ను విచారించింది.
లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరిగింది. అయితే పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పలేదని తెలిసింది. కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగా.. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు సమాచారం. విచారణ తర్వాత.. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. మరికాసేపట్లో ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 200 మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. నివాసం వద్ద కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa