ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. పథకం అర్హతకు అదే ప్రామాణికం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 06:54 PM

తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ రూ.2 లక్షలు అమలు చేయగా.. తాజాగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అయింది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12వేలు ఇవ్వాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ నగదు ఇచ్చే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత రూ.6వేల చొప్పున నేరుగా అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు. కాగా ఈ పథకానికి అర్హులుగా భూమి లేని నిరుపేదలై ఉండి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లినవారిని పరిగణనలోకి తీసుకోనున్నారు.


ఇక ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో రెవెన్యూ, వ్యవసాయ, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డులు పొందిన కుటుంబాలను పరిగణనలోనికి తీసుకుంటారు. రైతుభరోసా కోసం నిర్వహించనున్న గ్రామసభల్లోనే ఈ పథకం లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఆయా సభల్లో ముసాయిదా జాబితాను బహిరంగంగా ప్రదర్శిస్తారు. వాటిని చదివి వినిపించిన తర్వాత చర్చించి గ్రామసభలోనే ఆమోదం తీసుకుంటారు.


గ్రామసభలో ఏవైనా అభ్యంతరాలు వస్తే ఎంపీడీవో వాటిపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారు. గ్రామసభల్లో ప్రాథమికంగా ఎంపికైన వారికి... ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా? అనే కోణంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలుగా అధికారులు నిర్ధారించిన తర్వాత వారి సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు 25న రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. దీని ఆధారంగా ప్రభుత్వం 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం విడుదల చేయనుంది.


ఇక రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద రూ. 12 వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం కసరత్తు మెుదలుపెట్టింది. వ్యవసాయ యోగ్యంగాని భూముల గుర్తింపునకు ఈ నెల 16 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. గుర్తించిన భూముల జాబితాలను ప్రదర్శించేందుకు గాను ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామసభలు జరపాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఇక ఈ నెల 26 నుంచి రైతుభరోసాను అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa