ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. రైతు కూలీలకు ఏడాది 12 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించగా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో.. జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. మరి.. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎవరెవరు అర్హులు.. వాళ్లను ఎలా గుర్తించనున్నారు.. ఏ ప్రాతిపదికనా ఈ పథకాన్ని అమలు చేయనున్నారన్నది ఇప్పుడు ప్రజల్లో ఎదురవుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే.. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం వెలువరించింది.
ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారు 10 లక్షల మంది అర్హులు ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. దీనికి అనుగుణంగా కసరత్తు చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని తేల్చింది.
సంవత్సరంలో కనీసం 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన వారినే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాని ప్రకారం ఉపాధి హామీ పథకంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ఏడాదిలో దాదాపుగా 10 లక్షల మంది కూలీలు 20 రోజుల పాటు పనిచేసినట్లు వెల్లడించింది. ఆ లెక్కన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడానికి ఏటా రూ.1200 కోట్ల మేరకు అవసరమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అంచనా వేస్తోంది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిబంధనలు
ధరణి పొర్టల్లో తమ పేరుపై భూమి లేని వారై ఉండాలి
ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి
బ్యాంకు అకౌంట్కు ఆధార్ కార్డు లింకై ఉండాలి
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి.
గ్రామపంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు
పైన షరతులన్నింటికి అర్హులైతేనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రెండు దశల్లో రూ.12 వేల ఆర్థిక సాయం పొందుతారు. తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామసభ నిర్వహించనున్నారు. అందులో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారు. అనంతరం అర్హుల తుదిజాబితాను ఆమోదిస్తారు. ఒకవేళ గ్రామ సభలో ఎవరైనా, ఏవైనా అభ్యంతరాలు ఎదుర్కుంటే.. సంబంధిత ఎంపీడీఓ వాటిని పరిశీలించి.. నిర్ణీత గడువులోపు సమస్యను పూర్తిగా తెలుసుకుని పరిష్కరిస్తారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నగదు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆధార్, జాబ్ కార్డులు, బ్యాంకు పాస్పుస్తకాలు అనుసంధానం కాని.. వాటిలో తప్పులుదొర్లిన ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఈ తప్పులను ఈ నెల 25వ తేదీలోపు సవరించాలని ఆయా జిల్లాల్లోని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇప్పటివరకు.. మొత్తం 6,92,921 మంది ఆధార్కార్డుల్లో తప్పులు ఉండగా.. ఆదివారం (జనవరి 12) వరకు 4,99,495 మంది సంబంధించిన కార్డులను అధికారులు సవరించినట్టు సమాచారం. జాబ్ కార్డులు, బ్యాంకు పాస్పుస్తకాల్లో నమోదైన తప్పులను కూడా అధికారులు సవరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa