2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే.. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే మాత్రం తెలంగాణ వచ్చుండేది కాదన్నది చాలా మంది అభిప్రాయం. రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్లు కావొస్తున్నా.. ఈ అభిప్రాయం మాత్రం మారట్లేదు. అయితే.. ఇదే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 కాదు.. 2009లోనే కావాల్సి ఉండేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. ఏపీలోని విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని.. కానీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు అనే తీర్మానాన్ని రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం పెట్టించాలని చూసిందని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన రహస్యాన్ని బయటపెట్టారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన.. 2009లోనే జరగాల్సిందని చెప్పారు.
తాను చీఫ్ విప్గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పిలిచి.. "మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం" అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికల ముందు ఆ తీర్మానాన్ని పెడితే ఓడిపోతామని ఆయనతో తాను చెప్పినట్టు వివరించారు. దానికి.."నా చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.." అని రాజశేఖర్ రెడ్డి తనతో చెప్పినట్టుగా పేర్కొన్నారు.
దీంతో తాము ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడామని.. "మేము తెలంగాణకు అనుకూలం" అనే తీర్మానాన్ని "మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు" అని మార్చి పెట్టామని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజన జరగదనే తాము అనుకున్నామని.. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నా విభజన ఆగేది కాదని కిరణ్ కుమార్ రెడ్డి తెలపటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో.. తన మాటల్లో రాజకీయాల పట్ల వైరాగ్యాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని.. ఎన్నికలంటే భయమేస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేమని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa