తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అమలుకు జనవరి 26వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలోని సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా.. సాగు యోగ్యత లేని ఒక్క ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని వెల్లడించారు. అయితే.. పోడు భూములకు (ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు) కూడా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో.. పంట వేసినా వేయకున్నా.. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద.. ఎకరానికి రూ.12 వేలు ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో.. సాగు యోగ్యత లేని భూములను ఎలా గుర్తిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. కాగా.. సాగు యోగ్యతలేని భూముల గుర్తింపునకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్లను ప్రభుత్వం రంగంలోకి దించతోంది. పంచాయతీరాజ్, మండల రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారుల సారథ్యంలో సాగు యోగ్యత లేని భూములను గుర్తించే ప్రక్రియను చేపట్టనున్నారు. పంచాయతీ సెక్రటరీ, ఏవోలు, ఆర్ఐలు.. ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ లీడర్స్గా ఉంటారు. ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్లో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్ఏ, ఏఈవోలు సభ్యులుగా ఉండనున్నారు. జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డీఏవోలు, ఎంపీడీవోలు తదితర ఉన్నతాధికారులు ఈ టీమ్లను పర్యవేక్షించనున్నారు.
ఇక.. ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్లు గ్రామాల్లో ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చర్ భూములు ఉన్నాయో గుర్తిస్తాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బృందంగా సర్వే చేయనున్నారు. ఆయా గ్రామాల్లోని ఆర్వోఆర్, పట్టాదారు పాస్పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూభారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా పర్యవేక్షించి, వ్యవసాయ యోగ్యంకాని భూముల జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితా ఆధారంగా తహసీల్దారు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నంబర్లలో ఉన్న భూములను పరిశీలించి, వ్యవసాయ యోగ్యత ఉందా లేదా అని పరిశీలించి.. గుర్తిస్తారు.
ఆ భూముల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించి, చదివి వినిపించి.. వాటిపై చర్చించిన అనంతరం ఆమోదం తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తారు. అనంతరం గ్రామాలవారీగా వ్యవసాయ యోగ్యంకాని భూముల పట్టికను పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి, డిజిటల్ సంతకం చేస్తారు.
ఇందుకోసం ఈ నెల 16 నుంచి 19 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 25న ఈ జాబితాలను జిల్లాలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి.. మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జనవరి 26న విడుదల చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa