తెలంగాణలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. సింగపూర్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందంకుదుర్చుకుంది. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(, సెంట్రల్ కాలేజీ ముందుకొచ్చారు. ఈ మేరకు.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శించారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో రేవంత్ రెడ్డి ముచ్చటించారు.
ఐటీఈ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఐటీఈ అధికారులు.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ వీఎల్ వీఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకడమిక్, అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్, ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్, జయేష్ రంజన్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్లో పర్యటించనుంది.
అంతకుముందు.. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అద్భుతమైన అంతర్ దృష్టి కలిగిన ఇండోఫైల్తో చాలా ఆకర్షణీయమైన, ఫలవంతమైన.. విస్తృత చర్చలతో సింగపూర్లో పర్యటనను ప్రారంభించినట్లుగా రేవంత్ బృందం ట్వీట్ చేసింది.
మౌలిక సదుపాయాల నిర్మాణం, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య మరియు నైపుణ్యాల నిర్మాణం, ఐటీ పార్కులు మొదలైన రంగాల్లో సుస్థిరమైన విస్తృత, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరుచనున్నట్లుగా తెలిపారు. సింగపూర్ పర్యటనలో అనేక ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలతో పెట్టుబడుల సాధనలో గొప్ప విజయం కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరిన్ని ప్రగతిదాయక వివరాలను త్వరలో షేర్ చేస్తామని.. టీమ్ తెలంగాణ రైజింగ్ తమ తదుపరి సమావేశానికి సన్నద్ధమవుతోందని వెల్లడించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా సింగపూర్ లో 17,18,19 తేదీల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం తదుపరి 20 నుంచి 22 వరకు దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్) వార్షిక సదస్సుకు హాజరవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa