తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసులు, విచారణలు నడుస్తుండగా.. మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, అరెస్టు ఇలా హాట్ హాట్గా తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (జనవరి 17న) సాయంత్రం వెలిమల తండాలో రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటునుంచి రఘునందన్ రావును నేరుగా పటాన్చెరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఎంపీ రఘునందన్ రావు.. ఈరోజు ఉదయం నుంచి గిరిజనులకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. పోలీసులు పలుమార్లు బుజ్జగించే ప్రయత్నం చేసినా రఘునందన్ రావు ఆందోళన విరమించలేదు. దీంతో.. రఘునందన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. రఘునంనదన్ రావును అరెస్టు చేసే సమయంలో.. పోలీసులను గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగ్గా.. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కాగా.. వెలిమల భూవివాదం గత పది రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలంటూ గిరిజనులు నిత్యం ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. గిరిజనుల ఆందోళనకు మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మద్దతు తెలిపారు. గిరిజనులకు బీజేపీ అండగా నిలుస్తుందని.. గురువారం (జనవరి 16న) పార్టీ కార్యాలయంలో ప్రకటించిన రఘునందన్ రావు.. శుక్రవారం (జనవరి 17న) ఉదయం పార్టీ శ్రేణులతో కలిసి వెలిమల తండాకు చేరుకున్నారు.
గిరిజనులతో కలిసి వెలిమల తండా నుంచి సదరు భూముల వద్దకు ర్యాలీగా చేరుకుని రఘునందన్ రావు ఆందోళన నిర్వహించారు. ఎంతసేపటికీ ఆందోళన విరమించకపోవటంతో.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే.. రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేయటంతో.. తర్వాత ఏం జరగనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రఘునందన్ రావును అరెస్టు చేయటంపై అటు గిరిజనులు, ఇటు బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa