తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఏడాది గడుస్తున్న వేళ.. ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న విపక్ష బీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇదే సమయంలో.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంపయిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని కూడా బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించటం గమనార్హం. అయితే.. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని.. ఉపఎన్నికలు ఖాయమంటూ బీఆర్ఎస్ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే.. ఉపఎన్నికలు వస్తే.. పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మళ్లీ ఎన్ని చోట్ల నెగ్గుతుంది..? కాంగ్రెస్ ఎన్నింటిని కైవసం చేసుకుంటుంది..? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదే అంశంపై.. పలు సర్వే సంస్థలు రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో ఎవరూ ఊహించని విధమైన ఫలితాలు వస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగానే.. సీ-ప్యాక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. తెలంగాణలోని పది స్థానాలకు ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలు వస్తే.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఎన్ని సీట్లు రానున్నాయన్నది వెలువరించింది. కాగా.. పదికి పది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే అయినా.. ఉపఎన్నికలు వస్తే మాత్రం గులాబీ పార్టీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి చెరో 4 స్థానాలు దక్కనున్నయని సీ-ప్యాక్ సర్వేలో వెల్లడైంది. అయితే.. మిగతా 2 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తోంది.
సీ-ప్యాక్ సర్వే ప్రకారం.. భద్రాచలం, గద్వాల్, పటాన్చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని.. చేవెళ్ల, స్టేషన్ ఘన్పూర్, బాన్సువాడ, జగిత్యాలలో మాత్రం మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే వస్తుందని తేలింది. ఇక ఖైరతాబాద్లో మాత్రం.. త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. రాజేంద్రనగర్లో కూడా అధికార, విపక్ష పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెప్తున్నాయి.
ఈ సర్వేకు సంబంధించిన అంచనాలకు సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సర్వేలో బీజేపీకి సంబంధించి ఎలాంటి ప్రస్థావన తీసుకురాకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్విట్టర్ హ్యాండిల్ బీఆర్ఎస్ అనుకూలమైనదేనని.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచార జరుగుతోంది. మరి ఈ సర్వే ఫలితాలు ఎంత వరకు నిజమవుతాయన్నది చూడాలంటే.. ముందు ఆ పది స్థానాల్లోని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాలి.. రాష్ట్రంలో ఉపఎన్నికలు రావాలి. అప్పటివరకు వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa