కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. ఇది దేవుడు పెట్టే పరీక్షా..? విధి అడే వింత నాటకమా..? మానవుని మహత్యమా..? అనే అనుమానం కలుగుతుంటుంది. అచ్చంగా అలాంటి సందర్భమే ఎదురైంది ఇక్కడ కూడా. నవమాసాలు తల్లిగర్భంలో ఉన్న శిశువు అప్పుడే బయటకు వచ్చి.. నేను వచ్చేశానంటూ కేర్ కేర్ మంటూ ఏడుస్తూ అందరికీ వినిపించేలా చెప్పింది. ఆ శిశువు ఏడుపు వినగానే.. ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఆ తల్లి ముఖం వెలిగిపోయింది. అప్పటివరకు పడిన పురిటినొప్పుల బాధనంతా.. ఆ బుజ్జాయి స్పర్శతో పూర్తిగా మర్చిపోయింది. మహాలక్ష్మి పుట్టిందన్న విషయం తెలియగానే.. ఆ కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎప్పుడెప్పుడు ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ముద్దాడదామా అని ఆతృత అందరి కళ్లలో కనిపిస్తోంది. కానీ.. వాళ్లందరినీ కాలం పరీక్షించాలనుకుందో ఏమో.. పెద్ద పరీక్షే పెట్టింది. అప్పుడే పోసుకున్న ప్రాణం ఊపిరందక విలవిల్లాడిపోయింది. చూస్తున్నంతలోనే.. ఆ చిన్ని గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.
ఈ ఊహించని పరిణామం చూసి.. అప్పటివరకు ఆనందంలో ఉన్న కుటుంబసభ్యులంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ప్రాణం పోసినట్టే పోసి.. అంతలోనే ఆయువు తీసేశావేంటయ్యా అంటూ దైవాన్ని దీనంగా నిందించటం మొదలుపెట్టారు. ఆ తల్లి కళ్లలో ఆనందాన్ని అర నిమిషమైనా ఉండనివ్వకుండా కన్నీళ్లు నింపేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అందరి గుండెలు బాధతో బరువైన సమయంలో మరో అనుకోని అద్భుతం జరిగింది. చనిపోయిందనుకున్న ఆ చిన్నారి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఆగిపోయిందనుకున్న ఆ చిన్ని గుండె మళ్లీ కొట్టుకుంది. ఈ అద్భుతం.. మెదక్ జిల్లాలో జరిగింది.
మెదక్ ప్రభుత్వాసుపత్రిలో ఓ గర్భిణీ.. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికే ఉన్నట్టుండి పాప ఊపిరి తీసుకోవటంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. చేతుల్లో ఇమిడిపోయే ఆ పసిప్రాణానికి ఊపిరందక అల్లాడిపోయింది. పరీక్షించిన వైద్యులు శివువు పరిస్థితిని అంచనావేసి.. మెరుగైన చికిత్స కోసం వెంటనే.. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
హుటాహుటిన.. అంబులెన్స్లో హైదరాబాద్కు బయలుదేరగా.. మార్గమధ్యలోనే పాప గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. అది కూడా తల్లిదండ్రులకు కూడా ఊపిరాగిపోయినంత పనైంది. పాపను గమనించిన 108 అంబులెన్స్ టెక్నీషియన్ రాజు.. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ముక్కుపచ్చలారని ఆ శిశువుకు వెంటనే సీపీఆర్ చేశాడు. దీంతో.. ఆ చిన్ని గుండె మళ్లీ కొట్టుకోవటం ప్రారంభించింది. దీంతో.. ఆ చిన్ని ప్రాణానికి ఆ అంబులెన్స్ టెక్నీషియన్.. మరోసారి ప్రాణం పోశాడు.
ఆ శిశువును నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి పాపకు సీపీఆర్ చేసిన టెక్నీషియన్ రాజును వైద్యులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa