హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పై వివక్షకు నిరసన గా రాష్ట్ర కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది.ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా జరగనుంది. నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, డిసీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు మహేష్ గౌడ్ పిలుపిచ్చారు. ధర్నాలో భాగంగా కాంగ్రెస్ నేతలు ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి, తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షకు నిరసనగా టీపీసీసీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఫిబ్రవరి 3న (సోమవారం) స్థానిక అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ చీఫ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపిచ్చారు.కాగా కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి 5 వాతం వాటాను అందిస్తున్న తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. రాష్ట్రం నుంచి రూ.26 వేల కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని గుర్తుచేసింది. అయినా.. తెలంగాణకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని విమర్శించింది. ఈ బడ్జెట్లో కేంద్ర సెస్లను మరింత పెంచుకుందని, దానివల్ల రాష్ట్రాల పన్నుల వాటాలు తగ్గే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది. కేంద్ర సౌజన్య పథకాలపై రాష్ట్రాలు ఆధారపడేలా నిధులు పెంచిందని, సీఎస్ఎస్లను రాష్ట్రాలు వర్తింపజేసుకోవాలా.. లేదా.. అన్న స్వయం నిర్ణయాధికారాన్ని విస్మరించిందని విమర్శించింది.
శనివారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్పై చర్చించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డి.శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై భట్టివిక్రమార్క ఓ పత్రికాప్రకటనను విడుదల చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి ప్రాధామ్యాలను కేంద్రం అర్థం చేసుకోలేకపోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. కొన్ని రకాల వస్తువులపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు చెబుతూనే.. కేంద్రం తన సెస్లను పెంచుకుందని ఆరోపించింది. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa