కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపాటు రాష్ట్రంలో కేసీఆర్ ను తలుచుకోని గుండె లేదని వ్యాఖ్య బీసీ కులగణన అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికి.మోదీ బీసీనా కాదా అనే చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని విమర్శించారు. రాహుల్ గాంధీది ఏ మతమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. మోదీ బీసీ అయితే మాకేంది? ఓసీ అయితే మాకేంది? అని కవిత అన్నారు. బీసీల జనాభాను కరెక్ట్ గా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. పక్కా లెక్కలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు పెట్టాలని... దాన్ని కేంద్రంలో బీజేపీ ఆమోదించాలని అన్నారు. ఇది చేయకుండా మోదీ కులం గురించి, రాహుల్ మతం గురించి మాట్లాడుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని హెచ్చరించారు. వంకర టింకర మాటలు మాట్లాడుతూ ప్రజలను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. 14 నెలల పాలనలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని అన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ను తలుచుకోని గుండె లేదని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే... కేసీఆర్ ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అందరి ఆశీర్వాదంతో, తన శక్తియుక్తులతో రాష్ట్రాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళతారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa