ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాదిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం గజ్వేల్ పట్టణంలోనీ పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ఇంచార్జ్ తుంకుంట నర్సారెడ్డి గారి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల, పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నీలం మధు హాజరయ్యారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను తీవ్రంగా వంచించిందని ఆరోపించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన జీవన్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలపై పోరాటం చేశారన్నారు. నిరుద్యోగుల మద్దతు తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అనుగుణంగా ఒక్క ఏడాదిలోనే 56 వేలకు పైగా కొలువులు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిందని తెలిపారు.పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఒక వైపు వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇస్తూనే మరొక పక్క రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు.గత నెలలో దావోస్ వేదికగా జరిగిన సదస్సులో రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన ఉదహరించారు.యువత కు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పడం జరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa