ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం,,,రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ-మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 07:20 PM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం (ఎస్ఎల్బీసీ) కుప్పకూలిన విషయం తెలిసిందే. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఇవాళ ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ 14వ కిలోమీటర్‌ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ప్రమాద సమయంలో టన్నెల్‌లో 50 మంది కార్మికులు పని చేస్తుండగా.. వారిలో 42 మంది బయటకు వచ్చారు. మరో 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాద స్థలిని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సందర్శించారు. అక్కడి పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్ని్స్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ నిపుణుల సహాయం తీసుకుంటామన్నారు.


'ఉదయం 8.30 గంటలకు పనులు ప్రారంభం అవగానే ఒక సైడ్ నుండి నీళ్లు టన్నెల్‌లోకి ప్రవేశించటం మొదలైంది. మెుత్తం 50 మందిలో 42 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. టన్నెల్‌లో చిక్కుపోయిన వారు ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ వాసులు. వారిలో ఒక ప్రాజెక్టు ఇంజినీరు, ఫీల్డ్‌ ఇంజినీరు, నలుగురు కార్మికులు, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌కు చెందిన ఇద్దరు బోరింగ్‌ మిషన్‌ ఆపరేటర్లు ఉన్నారు. చీకటిగా ఉండటంతో లోపల చిక్కుకుపోయినవారి వెదుకులాట ఇబ్బందిగా మారింది. నీళ్లు టన్నెల్‌లో నిండిపోవడం వల్ల మట్టి కలిసిపోయి మొత్తం బురద మయంగా మారినట్లు తెలుస్తోంది.


ఘటనకు కొన్ని క్షణాలకు ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారు. బోల్ట్స్ ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్స్ కిందపడిపోయాయి. ఈ ఘటనతో విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి మొత్తం చీకటి అలుముకుంది. ఉత్తరాఖండ్‌లో ఆ మధ్య ఇలాంటి ఘటన జరిగినపుడు ఎలా అందులో చిక్కుకున్న కార్మికులను బయటికి తెచ్చారో తెలుసుకుంటున్నాం. నిపుణులతో మాట్లాడుతున్నాం. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ , నిపుణుల సహాయం తీసుకుంటాం. టన్నెల్‌లో చిక్కుకున్న వారికి వెంటిలేషన్‌ ఇబ్బంది లేదు. 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కు పోవడంతో వారిని బయటకు తీసుకురావడం సవాల్‌గా మారింది. రెస్క్యూ బృందాలు ఈ రాత్రికి ఘటనా స్థలికి చేరుకుంటాయి.' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa