ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లు బయటికి వస్తారని చిన్న ఆశ ఉంది,,,,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 07:18 PM

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం చాలా విషాదకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో బయటకు వస్తారని ఎక్కడో చిన్న ఆశ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్‌ వద్ద జరుగుతున్న సహాయ చర్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కలిసి పర్యవేక్షించారు. అనంతరం.. మీడియా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టన్నెల్‌లో చిక్కుకున్నవారిని రక్షించడమే తమ ముందున్న ప్రధాన బాధ్యత అని.. కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కోమటిరెడ్డి తెలిపారు. అయితే.. ఇంత పెద్ద ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. వారంతా వందల కిలోమీటర్ల దూరం దాటి పని కోసం వచ్చారని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి.. అందరూ ప్రాణాలతో బయటికి వస్తారనే ఆశ మాత్రం తనకు ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.


ఇదే క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వమే పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేతల్లగా ఏళ్ల తరబడి ఫాంహౌజ్‌లో పడుకోలేదని ఎద్దేవా చేశారు. తమను పంపించి సహాయక చర్యలు సమీక్షిస్తున్నారని తెలిపారు. ట్విట్టర్ ఉంది కదా అని కేటీఆర్ ఏది పడితే అది పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. ప్రమాదాన్ని రాజకీయం చేయాలనుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.


 ఈ సందర్భంగా ఎక్స్‌(ట్విట్టర్)లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోస్టు పెట్టారు. SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించినట్టు తెలిపారు. ఎంత కష్టమైనా సరే టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న భాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకొని వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉంటే.. ఎస్ఎల్‌బీసీ ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్‌ లోపల ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకున్నట్టు అధికారులు తేల్చగా.. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సింగరేణి రెస్క్యూ బృందాలు, హైడ్రా, ఇండియన్‌ ఆర్మీ, స్పెషల్‌ బెటాలియన్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున మట్టిదిబ్బలు ఉండటంతో పాటు నీళ్లు బురద ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పాటుతున్నట్టు తెలుస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa