హైదరాబాద్ నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంబర్పేట్ ఫ్లైఓవర్పై ఎట్టకేలకు వాహనాలు పరుగులు పెట్టాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో మహా శివరాత్రి పండగ నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలకు అనుమతి లభించింది. అయితే ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తి కాగా.. దాని కింది భాగంలో కొన్ని పనులు మిగిలిపోయాయి. ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, ఇతర సుందరీకరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. కానీ పైన ఫ్లైఓవర్పై మాత్రం అని పనులు పూర్తి అయ్యాయి. దీంతో స్థానిక లోక్సభ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్పై వాహనాలు నడిచేందుకు అనుమతి లభించింది. ఇక దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి.. త్వరలోనే అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరపనున్నారు.
అయితే అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వరకు ఆగకుండా.. అప్పటివరకు ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు రాకపోకలకు అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అంబర్పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణం అనేది స్థానికంగా ఉంటున్నవారికే కాకుండా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు దశాబ్దాల నుంచి ఉన్న ఒక కల. తాజాగా ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ వాహనాల రాకపోకలకు అందుబాటులోకి రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు మంగళవారం అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులను స్వయంగా కిషన్ రెడ్డి పర్యవేక్షించారు. దీంతో ఆయన ఆదేశాలతో నేటి నుంచి నగరవాసులకు ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్, శ్రీ రమణ జంక్షన్ల మీదుగా నిర్మించిన 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఫ్లైఓవర్ విస్తరణ పనులు చేపట్టినా ఛే నంబర్- శ్రీరమణ చౌరస్తాల మధ్య ఉన్న శ్మశాన వాటికల కారణంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. అంతేకాకుండా దీని వల్ల జాతీయ రహదారిపై స్థానికులతోపాటు వరంగల్ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో.. తానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఈ అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ఇక ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ పూర్తయినా కింద సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ఇంకా 6 చోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ భూసేకరణ చేపట్టాల్సి ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దానికి సంబంధించి.. రూ.2.51 కోట్ల నష్టపరిహారం చెక్కు అందుకున్నా.. అందుకు భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జాతీయ రహదారుల శాఖకు అప్పగించలేదని తెలిపారు. భూసేకరణ పూర్తి చేసి.. స్థలాన్ని అప్పగిస్తే పనులు త్వరగా పూర్తి చేస్తామని కిషన్రెడ్డి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa