ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై ప్రధానితో సీఎం చర్చించారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాద ఘటన గురించి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని.. ప్రధాని మోదీని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
ఇక ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు లేవని ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి అన్ని రకాలుగా చేయూత అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళనకు కేంద్రం నుంచి సహకారం అందించాలని విన్నవించుకున్నారు. చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్రెడ్డి కోరారు. ప్రధానితో భేటీ సందర్భం ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్బాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ ఢిల్లీ పర్యటనలోనే పలువురు కేంద్రమంత్రులతోనూ ఇవాళ సీఎం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 లైన్, ఎయిర్పోర్ట్ వరకు పొడగింపు.. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం, అనుమతులపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు.. తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సాయం వంటి అంశాలను ప్రధానితో భేటీలో సీఎం బయటపెట్టారు.
ఇక భేటీ సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి ప్రధాని మోదీ.. రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీశారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను సురక్షితంగా కాపాడి బయటికి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. టన్నెల్లో భారీగా నీరు, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa