ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త ఆ పరీక్షలకు ఒప్పుకోలేదని భార్య ఘోరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 05:52 PM

కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణం. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఎలాంటి సమస్య వచ్చినా.. ప్రేమగా మాట్లాడుకుని పరిష్కరించుకోవటమే అసలైన మార్గం. కానీ.. చాలా మంది ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి.. ఘర్షణలకు పాల్పడుతూ క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోపావేశాల్లో విచక్షణ కోల్పోయి.. ఎదుటివారి ప్రాణాలు తీయటమే.. లేక తమ విలువైన ప్రాణాలనే తీసుకోటమో చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అచ్చంగా అదే జరిగింది.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో.


తేలుకుంటకు చెందిన మేకల పద్మ (48), తిరుపతి దంపతులు.. బతుకుదెరువు కోసం 13 ఏళ్ల క్రితం మలేషియా వెళ్లారు. ఈమధ్యే తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అయితే.. నెల రోజులుగా తిరుపతి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా తిరుపతికి జ్వరం తగ్గకపోవడంతో పద్మ తీవ్ర కలత చెందింది. కాగా.. గత కొన్ని రోజులుగా పెద్దపల్లిలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. ఎన్నాళ్లు వైద్యం చేయించినా జ్వరం తగ్గక పోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి భర్తను చూపించింది. అక్కడ.. తిరుపతికి వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. క్షయ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించారు.


అయితే.. వ్యాధి తీవ్రత ఎంతగా ఉందనేది తెలుసుకోవటంతో పాటు ఎలాంటి చికిత్స అందించాలన్నది తెలియాలంటే.. మరికొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ.. గత కొన్ని రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ పరీక్షల మీద పరీక్షలు చేయించుకుంటున్న తిరుపతిని.. మరిన్ని పరీక్షలు చేయించుకోవాలని చెప్పగా సరేమిరా అన్నాడు. ఎంత నచ్చజెప్పినా రక్తపరీక్షలు చేయించుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో.. భార్య పద్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. మలేషియా నుంచి వచ్చిన తర్వాత సుమారు నెల రోజులుగా భర్తతోనే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ కష్టపడుతున్నా.. వ్యాధి నయమయ్యేందుకు రక్త పరీక్షలు చేపించుకొమ్మంటే మాట వినటం లేదన్న బాధతోనో, కోపంతోనే పద్మ కఠిన నిర్ణయం తీసుకుంది.


పురుగుల మందు తాగి.. ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది పద్మ. భర్య విగతజీవితా దూలానికి వేలాడటం చూసిన భర్త తిరుపతి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa