ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కోరలు చాస్తున్న క్షయ.. కొత్తగా 4,600 టీబీ కేసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 05:57 PM

తెలంగాణలో క్షయ వ్యాధి క్రమంగా విస్తరిస్తోంది. వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలను చైతన్య పరుస్తున్నా టీబీ కోరలు చాస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 4,600 కేసులు వెలుగులోకి వచ్చాయి. వంద రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన క్షయ నిర్ధారణ పరీక్షల్లో కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో కేసులు ఎక్కువగా ఉన్న 9 జిల్లాలను గుర్తించి.. అక్కడ ఆరు పోర్టబుల్‌ హ్యాండిల్డ్‌ ఏఐ ఎక్స్‌రే యంత్రాలను ఉపయోగించారు. ఇందులో కొత్త కేసులు వెలుగు చూడటం కలవరపాటుకు గురి చేస్తోంది.


క్షయ వ్యాధి లక్షణాలు..


కాగా, క్షయ వ్యాధి ట్యూబర్‌ కోలోసిస్‌ అనే సూక్ష్మక్రిమి వల్ల సంక్రమిస్తుంది. రెండు వారాలకు మించి తీవ్రమైన జ్వరం, దగ్గు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఎక్కువగా దగ్గినపుడు కఫంతోపాటు జీరలు పడినా క్షయ వ్యాధి లక్షణాలుగా డాక్టర్లు పేర్కొంటున్నారు. తక్షణమే పరీక్షలు చేసినట్లైతే వ్యాధి తీవ్రతను ఆరంభంలో కట్టడి చేయటానికి వీలుంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ గా ఉండే వారిలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. వ్యాధి సోకిన వారు సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా మందులు వాడితే ఈజీగా నయం చేయవచ్చు. లేదంటే ఈ వ్యాధితో ప్రాణానికే ప్రమాదం.


క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన రోగి దగ్గు, తుమ్ము, ఉమ్మితో మరొకరికి వ్యాపించవచ్చు. రద్దీ ఉన్న ప్రదేశాల్లో క్రిములు చాలా సులభంగా ప్రవేశిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మందులు వాడుతున్న వారిలో క్షయ వ్యాధి సులభంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినపుడు, తుమ్మినపుడు జాగ్రత్తలు పాటించకపోతే గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తులకన్నా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా క్షయ వ్యాధి బారిన పడతారని డాక్టర్లు వెల్లడించారు.


ఇక క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుంది. వాటిని క్రమం తప్పకుండా వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాధిగ్రస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోగ నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని.. ముందుగా గుర్తిస్తే ప్రాణాల కాపాడుకోవచ్చునని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa