శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదంలో మరో మృతదేహం లభ్యమైంది. ఇవాళ ఉదయం రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు జరుపుతుండగా మృతదేహం ఆనవాళ్లు లభించాయి. కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది.. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ముందుగా గుర్తించిన అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటన జరిగిన నెలా 3 రోజుల తర్వాత రెండో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, మృతుడు ఎవరనేది తెలియాల్సి ఉంది.
కాగా, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇప్పటికే నెల రోజులు గడిచిపోయింది. గత నెల 22న ప్రమాదం జరగ్గా.. అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం దేశంలోనే అన్ని ప్రముఖ రెస్క్యూ టీంలను రంగంలోకి దింపారు. ఆర్మీ. ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, కేరళ కేడావర్ డాగ్స్ స్వ్కాడ్ వంటి వాటితో రెస్క్యూ చేపట్టారు. గత 15 రోజుల క్రితం గురుప్రీత్ సింగ్ అనే కార్మికుడి మృతదేహం లభ్యమైంది. అప్పటి నుంచి తవ్వకాలు చేపడుతున్నా ఎలాంటి పురోగతి లభించలేదు. టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారీగా మట్టి పేరుకుపోవటం, నీటి ఊట ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అంటున్నారు. అయితే టన్నెల్ ప్రమాద ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెంది ఉంటారని అధికారులు వెల్లడించారు. కనీసం వారి మృతదేహాలైనా కుటుంబ సభ్యులకు అందించాలన్న ఉద్దేశ్యంతో తవ్వకాలు జరుపుతున్నట్లు చెప్పారు.
ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉందని.., అది కూలిపోయే అవకాశం కూడా ఉందని అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలిసింది. కాగా, అందులో చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సీఎం అధికారులను ఆదేశించిటన్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa