తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోంది. దీనిలో భాగంగా రైతులకు అందజేస్తున్న బోనస్ కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వానాకాలం సీజన్లో మొత్తం రూ.1700 కోట్లు బోనస్ అందజేయగా.. ప్రస్తుతం అది యసంగిలో కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మంత్రి కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించారు. ఇక్కడ నాయకన్ గూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి.. రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మాలని మంత్రి సూచించారు. దళారులకు బదులు.. నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతులు ఎక్కువ లాభాలు పొందగలరని ఆయన వివరించారు. ప్రతి క్వింటాకు రూ.500 అదనంగా అందించడంతో పాటు.. మద్దతు ధర కూడా కొనసాగుతుందని తెలిపారు.
అంటే ప్రస్తుతం యాసంగిలోనూ సన్న బియ్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక రైతు యాసంగి సీజన్లో ఎకరాకు వరి పంట 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటే.. బోనస్ కింద రూ.5000 అందుతాయి. రైతుభరోసా కింద ఒక్క సీజన్కు రూ.6000 చొప్పున తీసుకుంటాడు. ఇలా మొత్తం రూ.11,000 ప్రభుత్వం నుంచే పొందుతాడు. ఇది రైతులకు ఎంతో ఉపయోకరంగా ఉండనుంది.
గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా.. వరి ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి మద్దతు ఇచ్చేలా విధానాలు అమలు చేస్తోందన్నారు. చివరి పంట వరకు నీళ్లను అందిస్తామని మంత్రి రైతులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. 25.65లక్షల రైతులకు రూ.20,687 కోట్లు రుణమాఫీ పూర్తి చేశామన్నారు
అనంతరం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి తల్లంపాడు, తెల్దారుపల్లి జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డులోని తరుణి హాట్లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్ర పనులను.. గూడూరుపాడు నుంచి గోళ్లపాడు.. ఊటవాగు తండా రోడ్డు వరకు రూ.2.97కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa