ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళ్లకు ప్రత్యేకంగా కొలతలు ,,,ఇంటింటికి వచ్చేస్తున్న అధికారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 06:07 PM

కరీంనగర్ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లోని ఇళ్లకు ప్రత్యేకంగా కొలతలు నిర్వహిస్తున్నారు అధికారులు. భువన్ యాప్ ద్వారా ఇళ్ల వివరాలను సరిజేస్తూ.. కొత్త పన్నుకు నోటీసులు పంపిస్తుంది. అక్రమ కట్టడాలపై సర్వే చేసి, నోటీసులు జారీ చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం మొదలైంది. అంతక ముందే ఇది ప్రారంభం కాగా.. మధ్యలో ఆగిపోయింది. మళ్లీ దానిని ప్రారంభించారు. అదేంటంటే.. ఇళ్లకు కొలతలు తీసుకోవడం. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలలోని ఇళ్లను కొలిచే పని మొదలైంది. రెండు సంవత్సరాల క్రితం భువన్ యాప్‌తో సర్వే చేశారు. అప్పుడు 75 శాతం ఇళ్లను లెక్కించారు. 2018లో కొన్ని గ్రామాలు నగరంలో కలిశాయి. దీంతో కొత్త భవనాలు చాలా పెరిగాయి. వాటికి సరిగ్గా పన్ను కట్టడం లేదు. కొందరు అదనపు అంతస్తులు కట్టుకున్నారు. కొన్ని ఇళ్లను ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకురాలేదు. చాలామంది అక్రమంగా నిర్మాణాలు చేశారు. ఆన్‌లైన్‌లో ఇంటి నంబర్లు తీసుకోవడంతో కొలతల్లో తేడాలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మళ్లీ కొలుస్తున్నారు.


నగరంలో.. పురపాలికల్లో భువన్ యాప్ ద్వారా ఇళ్ల ఫోటోలు, కొలతలు తీసుకున్నారు. వాటిని అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఇంటర్నెట్‌లో నమోదు చేశారు. వీటన్నింటికీ ఆస్తి పన్నును లెక్కిస్తున్నారు. ఆస్తి పన్ను సర్దుబాటు చేయాల్సి ఉంది. కానీ.. దాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పన్నుతో నోటీసులు వచ్చే అవకాశం ఉంది.


ఆస్తి పన్నులో తేడాలు ఉండటంతో ఇంటింటికి సర్వే చేస్తున్నారు. అదనపు నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇస్తున్నారు. కొత్తగా వచ్చిన వార్డు అధికారులకు డివిజన్లు, వార్డులు అప్పగించారు. తక్కువ ఆస్తి పన్ను కడుతున్న వారి జాబితా తీసుకొని మళ్లీ కొలుస్తున్నారు. ముఖ్యంగా అదనంగా అంతస్తులు కట్టుకున్న వారిని.. అక్రమ నిర్మాణాలు చేసిన వారిని వదిలిపెట్టడం లేదు.


భువన్ యాప్‌తో పాటు అదనపు నిర్మాణాలకు కొలతలు ఇష్టానుసారంగా చేస్తున్నారు. దీనివల్ల పన్నుల భారం ఎక్కువ అవుతోంది. దీంతో ఇంటి యజమానులు కంగారు పడుతున్నారు. కొందరికి ఎలాంటి కొలతలు తీసుకోకుండానే ఎక్కువ ఆస్తి పన్ను కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకానొక సమయంలో నల్లా కనెక్షన్ కూడా తీసేశారు. దీనిపై అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా దాటవేశారని ప్రజలు కోపంగా ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఆస్తిపన్ను అధికంగా వస్తుందనే ఫిర్యాదుల మేరకు తిరిగి కొలతలు చేపట్టి ఆస్తిపన్ను రాబట్టుకోవాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. అంటే ఆస్తి పన్ను ఎక్కువగా వస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే మళ్లీ కొలతలు తీసి ఆస్తి పన్ను వసూలు చేయాలని భావిస్తున్నారు.


కరీంనగర్ మున్సిపాలిటీలో ఇళ్ల సంఖ్య 86,815 ఉండగా.. జమ్మికుంట మున్సిపాలిటీలో 12,607 ఉన్నాయి. అంతే కాకుండా.. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 8,917 ఇళ్లు ఉండగా.. చొప్పదండి మున్సిపాలిటీలో 4,235 ఇళ్లు ఉన్నాయి. వీటికి అంతకముందు కొలతలు తీసుకున్న ఇళ్లను మినహాయించి.. మిగతా ఇళ్లకు కొలతలు తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa