హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ భూముల్లో చెట్లు నరికివేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. చెట్ల పునరుద్ధరణకు ప్రణాళికతో రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. భూముల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు..? ఎంత కాలంలో పూర్తి చేస్తారు..? జంతువులను ఎలా సంరక్షిస్తారు..? అనే అంశాలపై ప్రణాళికను 4 వారాల్లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నేడు విచారించింది. చెట్లను ఇష్టానుసారంగా నరికివేయడాన్ని సమర్థించుకోవడం సరికాదని ప్రభుత్వానికి చురకలంటించింది. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రణాళికతో రావాలని కోర్టు ఆదేశించింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలంది. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే తెలంగాణ సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. వారిని కాపాడాలనుకుంటే.. విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. చెట్ల పునరుద్ధరణను వ్యతిరేకిస్తే.. ఆ భూముల్లోనే తాత్కాలిక జైలును కట్టి వారిని అందులోకి పంపుతామని ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది.
కోర్టు నోటీసు లేకుండా వివాదాస్పద భూమిలో ఒక్క చెట్టు కూడా నరకొద్దని ఆదేశించింది. తీర్పు వెలువరించిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో బుల్డోజర్లు ఎందుకున్నాయని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు సమాధానమిస్తూ.. ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశాయని తెలిపారు. కొన్ని మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కోర్టుకు విన్నవించారు.
వాదనలు విన్న ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూములపై స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. భూముల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు..? ఎంత కాలంలో పూర్తి చేస్తారు..? జంతువులను ఎలా సంరక్షిస్తారు..? అనే అంశాలపై ప్రణాళికను 4 వారాల్లోగా సమర్పించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa