తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలు, రానున్న మూడు రోజులు తీవ్రమైన వేడిమిని ఎదుర్కోవలసి ఉంటుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రానున్న 72 గంటల్లో రాష్ట్రంలో వడగాల్పులు, అధిక ఉక్కపోత ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుందని వారు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రానున్న మూడు రోజులు తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు తీవ్రంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు పగటిపూట అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి.. మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ జిల్లాల్లో కూడా వడగాల్పుల ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయితే.. రానున్న మూడు రోజుల తర్వాత.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వర్షాలు వడగాల్పుల నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండటం.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa