ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్ నోట ఇలాంటి మాట రావడంతో.. రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 07:29 PM

కొంతమంది ప్రభుత్వ అధికారులు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తుంటారు.. మరికొందరు మాత్రం మెరుపు వేగంతో స్పందించి బాధితులకు తక్షణ ఉపశమనం కలిగిస్తారు. తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే సామాన్యులకు లంచం డిమాండ్ చేసే అధికారుల తీరుతో నిరాశ ఎదురవుతుంది.


కొందరు బాధితులు పై అధికారులకు ఫిర్యాదు చేసినా.. కొందరు రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. అయితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. ఆయన చూపిన సమయ స్పూర్తి, బాధితుడికి ఇచ్చిన భరోసా అక్కడి రెవెన్యూ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.


అశ్వాపురంలో భూభారతి రెవెన్యూ చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు కొత్త చట్టం గురించి వివరిస్తుండగా.. ఆనందపురం గ్రామానికి చెందిన ఒక రైతు తన బాధను కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నాడు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని స్థానిక రెవెన్యూ సిబ్బంది రికార్డుల్లో నమోదు చేయడం లేదని.. అలా చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.


రైతు చెప్పిన మాటలు విన్న కలెక్టర్ వెంటనే స్పందించారు. ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ‘వెంటనే సంబంధిత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయండి. ఆ అధికారులను పట్టుకోండి. ఒకవేళ మీరు ఫిర్యాదు చేయడానికి భయపడితే నాకు చెప్పండి, నేనే స్వయంగా ఏసీబీ అధికారులను పంపిస్తాను’ అని ఆ రైతుకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ నోటి నుండి ఏసీబీ అధికారుల పేరు వినగానే, అక్కడున్న రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. కలెక్టర్ మాటలతో అవగాహన సదస్సుకు హాజరైన రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. తమ సమస్యలు ఇక పరిష్కారమవుతాయనే నమ్మకం వారిలో కలిగింది.


కలెక్టర్ జితేష్ వి పాటిల్ చూపిన ఈ చొరవు.. రైతుకు ఇచ్చిన భరోసా నిజంగా అభినందించదగినది. లంచం అడిగే అధికారులపై ఆయన తీసుకున్న ఈ కఠినమైన వైఖరి మిగిలిన అధికారులకు కూడా ఒక గుణపాఠం లాంటిది. ఇకపై అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి. కలెక్టర్ చర్యతో లంచగొండి అధికారుల గుండెల్లో గుబులు మొదలై ఉంటుందనడంలో సందేహం లేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa