తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకప్పుడు విద్యా కేంద్రాలుగా వెలుగొందిన ఈ బడులు, నేడు తల్లిదండ్రుల ప్రైవేట్ మోజుతో కళ తప్పిపోతున్నాయి. గ్రామంలో ఒకరు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమం పేరుతో లక్షలు గుమ్మరిస్తుంటే, మిగిలిన వారు కూడా అదే బాటలో పరుగెడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతున్నా.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పక్కింటి వారిని చూసి తమ పిల్లలను ప్రైవేట్ పరం చేసే ధోరణి సమాజంలో వేళ్లూనుకుపోయింది.
నెలనెలా లక్షల జీతం తీసుకునే వారికి ఇది పెద్ద భారం కాకపోయినా, రోజువారీ కూలీ చేసుకునే పేద తల్లిదండ్రులకు ఇది పెను భారంగా అవుతుంది. అయినా.. సమాజంలో తమ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం వారు అప్పులు చేసి మరీ ప్రైవేట్ బడులకు తమ పిల్లలను పంపుతున్నారు. ‘‘ఒక గొర్రె బాయిలో పడితే మిగతా గొర్రెలు కూడా దాని వెంటే వెళ్తాయి’’ అన్న చందంగా.. ఊరైనా పట్టణమైనా ఇదే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఎలాగైనా తమ బడిని నిలబెట్టుకోవాలనే తపనతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళ్లెం వీరారెడ్డి చేసిన ప్రయత్నం మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఆయన తన ఉపాధ్యాయ బృందంతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లారు. అక్కడ కూలీ చేస్తున్న తల్లిదండ్రులను కలుసుకొని.. చేతులు జోడించి వేడుకున్నారు. ‘‘అయ్యా, అమ్మా.. ప్రభుత్వ బడుల్లో ఎంతో అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ప్రైవేట్ బడులకు వృథా చేయకండి. మీ పిల్లలను మా బడిలో చేర్పించండి. ఒకవేళ మా చదువులో లోపం ఉంటే మమ్మల్ని నిలదీయండి’’ అని ఆయన ఆవేదనగా విన్నవించారు.
ప్రధానోపాధ్యాయుడి ప్రయత్నం.. ఆ మాటల్లోని నిజాయితీ కూలీల హృదయాలను తాకింది. వారిలో చలనం వచ్చింది. తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తామని వారు హామీ ఇచ్చారు. మొదటి రోజు 14 మంది విద్యార్థులు చేరగా.. రెండో రోజు మరో 17 మంది బడిలో అడుగుపెట్టారు. ఒక ఉపాధ్యాయుడు తలచుకుంటే ప్రభుత్వ బడుల రూపురేఖలు ఎలా మార్చవచ్చో వీరారెడ్డి నిరూపించారు. మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తే.. తెలంగాణలోని ఏ ప్రభుత్వ పాఠశాల కూడా విద్యార్థులు లేకుండా వెలవెలబోదు. పిల్లల నవ్వులు, చదువుల సందడితో ఆ బడులన్నీ కళకళలాడుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa