ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసి మురుగుకు చెక్... 3,100 కోట్లతో ప్రణాళిక.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 08:34 PM

హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందికరంగా మారిన మూసీ నది మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. మూసీ నదిలోకి మురుగు ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేయాలనే లక్ష్యంతో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్) విస్తృత ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. మూసీ నదికి ఇరువైపులా భారీ మురుగు ట్రంక్ లైన్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రెండు దశల్లో రూ. 3,100 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


త్వరలో జలమండలి ఇంజనీర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి.. మురుగు కలుస్తున్న ప్రాంతాలను గుర్తించి.. లోటుపాట్లను విశ్లేషించిన తర్వాత కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ఎంఆర్‌డీసీఎల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోజువారీగా ఉత్పత్తి అవుతున్న మురుగు నీటిలో 80 శాతం మూసీ నదిలోకి చేరుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) మధ్యలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న నది పూర్తిగా మురుగుతో నిండిపోయింది.


గతంలో జంట జలాశయాల నుంచి నార్సింగి వరకు కొంతవరకు స్వచ్ఛమైన నీరు కనిపించేది. అయితే.. ఎగువ ప్రాంతాల్లో జనావాసాలు పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నార్సింగి నుంచి గౌరెల్లి వరకు నదికి ఇరువైపులా 45 కిలోమీటర్ల మేర 2,000 మిమీ నుంచి 2,600 మిమీ డయా పైపులైన్లతో మురుగును మళ్లించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. 3,100 కోట్ల వ్యయంతో డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఆ ప్రణాళికను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది.


ప్రస్తుతం నగరంలో 52 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) ఉండగా.. సివరేజీ మాస్టర్ ప్లాన్ ప్రకారం మరో 39 ఎస్టీపీలు నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్టీపీలను నిర్మించి, ట్రంక్ లైన్లకు అనుసంధానం చేయడం ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే నదిలోకి వదులుతారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై ఎంఆర్‌డీసీఎల్ దృష్టి సారించింది. పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నిధుల కోసం దరఖాస్తు చేశారు. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఉత్తరం వైపు తారామతి బారాదరి, నానక్‌రామ్‌గూడ, ఇబ్రహీంచెరువు, కార్వాన్, నాంపల్లి, నారాయణగూడ, అంబర్‌పేట, రామంతాపూర్, పీర్జాదిగూడ, కొర్రేముల ప్రాంతాల మీదుగా 27.5 కిలోమీటర్ల మేర రూ. 1,054 కోట్లతో ట్రంక్ లైన్ నిర్మాణం చేపట్టనుండగా.. దక్షిణం వైపు బాపూఘాట్, అత్తాపూర్, చార్మినార్, మలక్‌పేట్, నాగోల్, గౌరెల్లి ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల మేర రూ. 1,048.95 కోట్లతో నిర్మాణం చేపడతారు.


నదికి ఉత్తరం, దక్షిణం వైపున నగరంలో రూ. 996.96 కోట్లతో ట్రంక్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం మూసీ నదిలోకి నేరుగా మురుగు నీరు వదలడం వల్ల శుద్ధి కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు. ట్రంక్ లైన్లు నిర్మించడం ద్వారా మురుగు నీటిని సేకరించి.. శుద్ధి కేంద్రాలకు తరలించి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే నదిలోకి వదులుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa