తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం వేళల్లో ఎండ తీవ్రంగా ఉంటుండగా.. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెదర్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, జనగాం, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు.. ఇప్పటికే కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రానున్న భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం కూడా ఉండటంతో మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని, సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa