పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థల శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. కాగా, చర్యపై దేశంలోని పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులుగా గర్విస్తున్నట్లు ట్వీట్ చేస్తున్నారు. పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ దాడుల నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టిందని అన్నారు. హిందువులని గుర్తించి మరీ చంపిన ఉగ్రవాదులకు ఇది తగిన గుణపాఠం అని ఆయన పేర్కొన్నారు. పహల్గాం దాడి జరిగిన రోజే ప్రధాని మోదీ టెర్రరిస్టులను వదలబోమని చెప్పారని.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని రాజాసింగ్ వ్యాఖ్యనించారు. ఉగ్రవాదులు బాధిత మహిళతో 'మోదీకి చెప్పుకో' అన్నారని.. ఇప్పుడు మోదీ రియాక్షన్ చూపించారని ఆయన గుర్తు చేశారు. ఇది హిందూ మహిళల బొట్టు తీస్తే ఎలా ఉంటుందో తెలిపే చిన్న ఉదాహరణ మాత్రమేనని అన్నారు. పాకిస్థాన్ను టెర్రరిజం ఫ్యాక్టరీగా అభివర్ణించిన రాజాసింగ్.. పాకిస్థాన్ను పూర్తిగా నాశనం చేయాలని సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ నలుమూలల నుంచి ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని.. ఈ విషయంపై మోదీ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం హైదరాబాద్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సైన్యానికి మద్దతు తెలపాలని ఆయన స్పష్టం చేశారు. సైన్యం ధైర్యసాహసాలను కొనియాడుతూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa