హైదరాబాద్ మహా నగరంలో 54 ఏళ్ల తర్వాత మళ్లీ మాక్ డ్రిల్ సైరన్ మోగింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు హైదరాబాద్ నగరంలో ఇలాంటి మాక్ డ్రిల్ జరిగింది. హైదరాబాద్లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
సాయంత్రం 4 గంటలకు సైరన్ మోగగా, 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు ఈ డ్రిల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4:15 నుంచి 4:30 గంటల వరకు వైమానిక దాడి జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. దాడుల నుంచి ఎలా బయటపడాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తోటి వారికి ఎలా సాయం చేయాలి, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స, వారిని ఆసుపత్రికి తరలించటం వంటి వాటిని కళ్లకు కట్టినట్లు చూపించారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు ఈ మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. అధికారులు నిర్దేశించిన సమయానికి ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు మాక్ డ్రిల్ ముగిసింది.
ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో రాజకీయాలకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్మీ, పోలీసు, విపత్తు నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు, మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని, మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర మందులు, ఆహార నిల్వలు సిద్ధం చేయాలని, బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల సమాచారం, రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలని తెలిపారు. 24 గంటలు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ఫేక్ న్యూస్పై ఉక్కుపాదం మోపాలని, ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని, విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని సూచించారు. దేశ సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుండి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో సీఎం, మంత్రులు పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa