సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లాకు, దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకుంటూ, "మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా" అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ మరిచిపోదని అన్నారు.జహీరాబాద్ను 'గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్'గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణ్ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, అవసరమైన నిధులను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. పటాన్చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిదని, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని సీఎం గుర్తుచేశారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకాన్ని అమలు చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలతో పోటీ పడేలా మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.స్థానికంగా చక్కెర పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు సహకార సంఘంగా ఏర్పడితే, నిమ్జ్లో వంద ఎకరాల భూమి కేటాయించడంతో పాటు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ సభలో సీఎం చేసిన ప్రకటనలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa