ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం భవిష్యత్తు లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 05:23 PM

బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం భవిష్యత్తు లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాశారంటూ ప్రచారంలో ఉన్న లేఖపై స్పందిస్తూ, అదొక పెద్ద జోక్ అని ఆయన కొట్టిపారేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.కవిత రాసినట్లుగా చెబుతున్న లేఖ గురించి కోమటిరెడ్డి మాట్లాడుతూ, "మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన వ్యక్తి రాసే లేఖకు ఒక పద్ధతి అంటూ ఉంటుందా? ఆ లేఖను మేమే సృష్టించాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఎలాంటి చీలికలు లేవని, ఇదంతా ఒక నాటకమని ఆయన అభిప్రాయపడ్డారు. బయటకు వచ్చిన లేఖ కూడా ఈ డ్రామాలో భాగమేనని ఆయన అన్నారు."తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమైనా ఉంటే నేరుగా చెప్పొచ్చు కదా" అని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వస్తున్నాయంటే ఎవరూ నమ్మరని కోమటిరెడ్డి పేర్కొన్నారు. "వారు అంత తేలిగ్గా గొడవపడరు. ఒకవేళ వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, అది కేవలం ఆస్తుల పంపకాలకు సంబంధించి మాత్రమే అవుతుంది" అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై తనకు ఎలాంటి ఆశలు లేవని ఆయన తేల్చిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa