హైదరాబాద్ మహా నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అకస్మాత్తుగా వైదొలగడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆమె నిర్వాహకులపై చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మాగీ 'ది సన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తమను వేశ్యల్లా చూశారని, ధనవంతులైన స్పాన్సర్లను అలరించడానికి, వారితో విందులలో పాల్గొనడానికి తమపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. ఆరుగురు పురుషులున్న టేబుల్కు ఇద్దరు అమ్మాయిలను కేటాయించి వారిని 'ఎంటర్టైన్' చేయాలని నిర్వాహకులు కోరారని ఆమె పేర్కొన్నారు.
ఈ అనుభవం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. 'బ్యూటీ విత్ ఏ పర్పస్' అనే పోటీ స్ఫూర్తికి ఇది విరుద్ధమని అన్నారు. భారీ మేకప్, బాల్ గౌనులు నిత్యం ధరించాలని ఒత్తిడి చేశారని కూడా ఆమె వెల్లడించారు. మిల్లా మాగీ మొదట వ్యక్తిగత కారణాలతో వైదొలిగినట్లు ప్రకటించినప్పటికీ.. తర్వాత తన అసలు కారణాలను వెల్లడించారు. ఈ ఆరోపణలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. మిల్లా ఆరోపణలు నిరాధారమైనవి పేర్కొంది. ఆమె తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెళ్లిపోయారని.. ఆమె కోరిక మేరకే ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. ఆమె ఇండియాలో ఉన్నప్పుడు కృతజ్ఞత, ఆనందం వ్యక్తం చేసిన అన్ఎడిటెడ్ వీడియోలను కూడా విడుదల చేయనున్నట్లు మిస్ వరల్డ్ ఛైర్పర్సన్, సీఈఓ జూలియా మోర్లే తెలిపారు.
తాజాగా ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలని ట్వీట్ చేశారు. ఇది నిజంగా బాధాకరమని అన్నారు. 'మిల్లా మ్యాగీ ఒక బలమైన మహిళ, మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నాం. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాం, గౌరవిస్తాం, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాము. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే.
దురదృష్టవశాత్తు, మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం.' అని ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa