ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులు.. పార్ట్ బీ డీపీఆర్‌పై కీలక అప్డేట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:52 PM

హైదరాబాద్ నగరంలో ప్రధాన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌గా మెట్రో మారుతోంది. ఆర్టీసీ తర్వాత ఎక్కువ మంది మెట్రోలోనే ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతుండగా.. ప్రతి రోజూ దాదాపు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే నగరం నలుమూలల మెట్రో విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు హైదరాబాద్ మెట్రో ఫేజ్‌ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా, తొలుత ఐదు కారిడార్లను ను పార్ట్‌-ఏ కింద ప్రతిపాదించారు.


  నాగోల్-ఎయిర్‌పోర్టు (కారిడార్-4): 36.8 కిలోమీటర్లు


రాయదుర్గం-కోకాపేట్ (కారిడార్-5): 11.6 కిలోమీటర్లు


ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (కారిడార్-6): 7.5 కిలోమీటర్లు


మియాపూర్-పటాన్‌చెరు (కారిడార్-7): 13.4 కిలోమీటర్లు


ఎల్‌బీనగర్-హయత్‌నగర్ (కారిడార్-8): 7.1 కిలోమీటర్లు


పార్ట్‌-ఏ కారిడార్లకు కిలోమీటరుకు సుమారు రూ.318 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం రూ.24,269 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 పద్ధతిన ఈ పనులను చేపట్టాలని నిర్ణయించాయి. పార్ట్‌-ఏ డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో గత ఏడాది నవంబర్ 4న కేంద్రానికి పంపించారు. నగరానికి ఉత్తరం వైపు కూడా మెట్రో రైలును విస్తరించాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వచ్చింది. దీంతో మరో మూడు కారిడార్లలో పార్ట్ బీ కింద మెట్రోను విస్తరించేందుకు సిద్దమయ్యారు.


జేబీఎస్ మెట్రో స్టేషన్-మేడ్చల్: 24.5 కిలోమీటర్లు (పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్)


జేబీఎస్ మెట్రో స్టేషన్-శామీర్‌పేట్: 22 కిలోమీటర్లు (20.35 కిలోమీటర్లు ఎలివేటెడ్, 1.65 కిలోమీటర్లు భూగర్భంలో - హకీంపేట విమానాశ్రయం సమీపంలో) శంషాబాద్ ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్‌సిటీ (స్కిల్ యూనివర్సిటీ): 39.6 కిలోమీటర్లు (1.5 కి.మీ భూగర్భం, 21 కి.మీ ఎలివేటెడ్, 17 కి.మీ ఎట్ గ్రేడ్)


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్‌ఏఎంఎల్ అధికారులు పార్ట్‌-బీ కింద మూడు కొత్త కారిడార్ల డీపీఆర్‌లను రూపొందించారు. అధికారులు సుమారు ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేసి ఈ డీపీఆర్‌లను రూపొందించారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో వీటిని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.


మొత్తం 86.1 కిలోమీటర్ల పొడవైన ఈ పార్ట్‌-బీ కారిడార్లకు రూ.19,579 కోట్లు అవసరమవుతాయని డీపీఆర్‌లో పేర్కొన్నారు. పార్ట్‌-ఏ కిలోమీటరుకు రూ.318 కోట్లు అంచనా వేయగా.. పార్ట్‌-బీలో కిలోమీటరుకు రూ.227.39 కోట్లతో తక్కువ వ్యయంతోనే రూపొందించినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌సిటీ మార్గంలో భూసేకరణ సమస్య పెద్దగా లేకపోవడంతో ఖర్చు తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే, జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట్ మార్గాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత ఈ డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ విస్తరణ హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసి, నగరవాసులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa