గిరిజనులను అటవీ చట్టాల పేరిట ఇబ్బందులకు గురి చేయవద్దని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. గిరిజనుల అభివృద్ధికి అటవీ శాఖ ఉన్నతాధికారులు సహకరించాలని అన్నారు. సచివాలయంలో శనివారం జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల అభివృద్ధికి ఫారెస్టు డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు, డీఎఫ్ఓలు సహకరించాలన్నారు. అటవీ సంరక్షణ, గిరిజనుల అభివృద్ధి రెండూ అనివార్యమేనని, నిబంధనలను పాటిస్తూ అటవీ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. కనీస సౌకర్యాలైన రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, తాగునీరు, కరెంటు లైన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలను అధికారులు పెండింగ్లో పెట్టడం సరికాదని మంత్రులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా, కావాలనే ఫైళ్ళను అటవీ అధికారులు పెండింగ్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణతో పాటు ప్రజల మౌలిక సదుపాయాల కల్పనను కూడా అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అటవీ చట్టాలు చెబుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. 1980 కంటే ముందు ఉన్న పల్లెల్లో రహదారులుంటే అవి పాడైతే మరమ్మతులు చేపట్టవచ్చని, అవసరమైన చోట కొత్త రహదారులు నిర్మించవచ్చని అటవీ చట్టాలు స్పష్టం చేస్తున్నప్పటికీ అటవీ అధికారులు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు సవివరంగా సమాధానాలు తెలుపాలన్నారు. అటవీ శాఖ నిబంధనలు అడ్డుగా ఉంటే, చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు తెప్పించాలని సూచించారు.
అడవుల సరిహద్దుల్లో ఉండాల్సిన చెక్ పోస్టులను గ్రామాల్లో ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసిందని ఇది సరైంది కాదన్నారు. అటవీ మీద ఆధారపడ్డ ఆదివాసీ గిరిజనులు అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చని అటవీ చట్టమే స్పష్టం చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అయినప్పటికీ తునికాకు, ఇప్పపువ్వు, పండ్ల సేకరణకు వెళ్లిన ఆదివాసీలను, గిరిజనులను ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని అటవీ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ఉత్పత్తులను సేకరించడం గిరిజనులకు ఉన్న హక్కు అని.. కేవలం వాటి కోసం అడవిలోకి వచ్చేవారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. నిబంధనలకు లోబడే అధికారులు వ్యవహరించాలని, అటవీ భూమిని పరిరక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగాలని అన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసేలా అన్ని శాఖ అధికారులు వ్యవహరించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa