కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సంబంధించి ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మే 15న కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని, స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణను తగిన విధంగా ఆహ్వానించలేదని, అలాగే అధికారిక ఫ్లెక్సీలలో ఆయన ఫోటోను పెట్టలేదని వంశీకృష్ణ అనుచరులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలు ఎన్నుకున్న దళిత ఎంపీని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల ఫోటోలు ఉన్నప్పటికీ, లోకల్ ఎంపీ అయిన వంశీకృష్ణ ఫోటో లేదని వారు ఆరోపించారు. దీంతో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా.. ఈ వివాదంపై ఎంపీ వంశీకృష్ణ స్పందించారు. ఆదివారం (మే 25) సాయంత్రం మంత్రి సీతక్క, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పుణ్యస్నానం ఆచరించిన అనంతరం వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పుష్కర స్నానం చేయడం ఆనందంగా ఉన్నప్పటికీ.. సరస్వతీ పుష్కరాలు తనను కొంత బాధించాయని ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యనించారు. డబ్బు కంటే కులం చాలా గొప్పదని తాను నేర్చుకున్నట్లు చెప్పారు. కులాన్ని బట్టి ఎవరెలా ప్రవర్తిస్తున్నారో తెలిసి వచ్చిందన్నారు. రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు చెప్పారు. తన హక్కుల కోసం పోరాడిన దళిత సంఘాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.
'డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను. కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను. నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను. రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్లొచ్చని మరొకసారి గుర్తుచేస్తున్నాను.' అని ఎంపీ గడ్డం వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంశీ కామెంట్స్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa