ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్, భట్టి . ఏం చేస్తారో చూడాలి: ఆకునూరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 06:51 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని, వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఈ భేటీపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


విద్య కీలక ప్రాధాన్యతా అంశంగా ప్రధానమంత్రి పేర్కొనడంపై ఆకునూరి మురళి స్పందించారు. రాజకీయ నాయకుల మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని ఘాటుగా స్పందించారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపైనే తమ ఆశలు ఉన్నాయన్నారు. వాళ్లు ఏం చేస్తారో చూడాలని ట్వీట్ చేశారు.


'అబద్దాలు ఆడడం , మోసపూరిత మాటలు మాట్లాడడం, ప్రజలను వంచించడం రాజకీయ నాయకులు అలవాటు చేసుకున్నారు. 2024-25 , 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం విద్యకు కేటాయింపులు 2.5 % . గత 20 సం. లలో కనిష్టం. కానీ ప్రధాని మోదీ మాటలు చూడండి. మన కెసీఆర్ అయితే ప్లాన్ ప్రకారం విద్యను ధ్వంసం చేసిండు. ఆయన చివరి ఆర్థిక సంవత్సరాల్లో విద్యకు కేటాయించిన బడ్జెట్ 6.4 % , 20 సంవత్సరాల్లో అతి తక్కువ కేటాయింపులు. రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారిపై ఆశలు పెట్టుకున్నాం. ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే బీజేపీ, బీఆర్ఎస్ వలన ప్రభుత్వ బడులలో విద్య కొన ఊపిరితో ఉంది. కాంగ్రెస్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ( 10 % విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడే గురుకులాల విద్య పూర్తి పరిష్కారం కాదు )' అని మురళీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా, తెలంగాణ సీఎం రేవంత్ తాము విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పదే పదే చెబుతున్నారు. విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన తన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌లో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న ఆకునూరి మురళి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మురళీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa