ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంకా 'రీఫండ్' రాలేదా.. డిసెంబర్ 31 దాటితే ఐటీఆర్‌ సవరణ కుదరదు

business |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 10:41 PM

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన గమనిక. మరో గడువు పొంచి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ( అసెస్మెంట్ ఇయర్ 2025-26) సంబంధించి మీరు దాఖలు చేసిన ఐటీఆర్ ఒకవేళ డిసెంబర్ 31, 2025 నాటికి ప్రాసెస్ కాకపోతే, ఆ తర్వాత మీరు సవరించిన ఐటీఆర్ దాఖలు చేసే అవకాశాన్ని కోల్పోతారు. ఐటీ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి, రీటర్నులలో తప్పులు దొర్లిన వారికి ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పవచ్చు. డిసెంబర్ 31లోపు మీకు రీఫండ్ రాకుంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. మరి వారు ఏం చేయాలో తెలుసుకుందాం.


ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, అసెస్‌మెంట్ ఇయర్ ముగిసే లోపు (అంటే డిసెంబర్ 31 లోపు) మాత్రమే రివైజ్డ్ లేదా బిలేటెడ్ ఐటీఆర్‌లను దాఖలు చేయడానికి అనుమతి ఉంటుంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఫైల్ చేసినప్పటికీ, ఆదాయపు పన్ను శాఖకు చెందిన సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఇంకా వాటిని ప్రాసెస్ చేయాల్సి ఉంది. ఒకవేళ సీపీసీ డిసెంబర్ 31 తర్వాత ప్రాసెస్ చేసి, అందులో ఏదైనా తప్పు ఉందని నోటీసు పంపితే, ఆ తప్పును సరిదిద్దడానికి మీరు రివైజ్డ్ ఐటీఆర్ వేయడానికి చట్టబద్ధంగా వీలుండదు.


ప్రస్తుత లెక్కల ప్రకారం దాఖలైన 8.34 కోట్ల ఐటీఆర్‌లలో దాదాపు 7.68 కోట్ల రిటర్నులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయి. మిగిలిన వారు ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మీ ఐటీఆర్ ప్రాసెస్ కాకపోవడం వల్ల రీఫండ్ రావడం ఆలస్యమైతే లేదా డిసెంబర్ 31 తర్వాత పొరపాట్లు గుర్తిస్తే ఈ మార్గాలను అనుసరించవచ్చు. ఐటీఆర్ ప్రాసెస్ అయిన తర్వాత అందులో లెక్కల్లో తప్పులు లేదా టీడీఎస్ క్రెడిట్లలో తేడాలు వంటి స్పష్టమైన పొరపాట్లు ఉంటే, సెక్షన్ 154 కింద ఆన్‌లైన్‌లో రెక్టిఫికేషన్ అభ్యర్థన పెట్టుకోవచ్చు. ఇది ఐటీఆర్ సవరణకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.


ఒకవేళ మీరు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉండి, పొరపాట్లు సరిదిద్దుకోవాలనుకుంటే ఐటీఆర్-యు దాఖలు చేయవచ్చు. అయితే, ఇందులో ఒక పెద్ద పరిమితి ఉంది. మీరు రీఫండ్ మొత్తాన్ని పెంచుకోవడానికి లేదా నష్టాలను చూపడానికి ఐటీఆర్-యు ఉపయోగించలేరు. ఇది కేవలం పన్ను చెల్లించే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీ ఐటీఆర్ చట్టబద్ధమైన గడువు (సాధారణంగా ఫైల్ చేసిన ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలల లోపు) దాటినా ప్రాసెస్ కాకపోతే, ఆదాయపు పన్ను పోర్టల్‌లోని e-Nivaran లేదా CPGRAMS ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీనివల్ల మీ కేసు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.


చట్టప్రకారం, జూలై 2025లో ఫైల్ చేసిన ఐటీఆర్‌ను ప్రాసెస్ చేయడానికి సీపీసీకి డిసెంబర్ 31, 2026 వరకు సమయం ఉంటుంది. కానీ పన్ను చెల్లింపుదారులకు మాత్రం తమ తప్పులను సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31, 2025 వరకే గడువు ఉంటుంది. ఈ వ్యత్యాసం వల్ల పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త వహించడం మంచిది. రీఫండ్ క్లెయిమ్ ఉన్నవారు తమ ఐటీఆర్ స్టేటస్ నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలి. ఒకవేళ డిసెంబర్ 31 లోపు ప్రాసెస్ కాకపోతే, పైన పేర్కొన్న రెక్టిఫికేషన్ లేదా గ్రీవెన్స్ మార్గాలను ఉపయోగించుకోవాలి. రివైజ్డ్ ఐటీఆర్ వేయాల్సిన అవసరం ఉంటే, అది కేవలం ఈ నెలాఖరు వరకే సాధ్యమని గుర్తించాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa