ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 09:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను సులభతరం చేసిన సంగతి తెలిసిందే. నామమాత్రమైన స్టాంప్ డ్యూటీతో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. తండ్రి, తాతల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూములను వాటి విభజనకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.


అయితే హక్కుదారులు, వారసులను నిర్ధారించడం కోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్లు వివరిస్తున్నారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ సమయంలో కుటుంబసభ్యుల సర్టిఫికేట్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అలాగే తండ్రి, తాతలకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలు, పూర్వ యజమానుల మరణ ధ్రువీకరణ పత్రాలు అందించాలి. ఇక రీసర్వే, భూ హక్కుల పుస్తకాలు ఉన్న ప్రాంతాల్లో ఎల్‌పీఎం నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.


ఇక స్టాంప్ డ్యూటీ విషయానికి వస్తే భూమి మార్కెట్ విలువ 10 లక్షల రూపాయల లోపు అయితే రూ.100, పది లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే రూ.1000ల నామమాత్రపు రుసుం చెల్లించాలి. వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే సమయంలో అన్ని పత్రాలను సరిచూసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.


చుక్కల భూములపై అధికారుల దృష్టి


మరోవైపు నిషేధిత భూముల పెండింగ్ సమస్యలపై అధికారులు దృష్టి సారించారు. అనంతపురం జిల్లా విషయానికి వస్తే గడిచిన రెండు నెలలుగా 22ఏ నిషేధిత భూములకు చెందిన పెండింగ్‌ దస్త్రాలను పరిష్కారించడంపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ మూడు విడతల్లో వేయికి పైగా ఫైళ్లను పరిష్కరించారు. తాజాగా అనంతపురం జిల్లా అధికారులు చుక్కల భూముల దస్త్రాలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పెండింగ్ దస్త్రాలు 5822 ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై అధికారులు ప్రస్తుతం దృష్టి సారించారు. అలాగే వెబ్ ల్యాండ్‌లోని తప్పులపైనా దృష్టి సారించారు. మొత్తంగా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ మూడు సమస్యలపైనా అనంతపురం జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa