ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 ఎకరాల్లో ,,,,తెలంగాణ కొత్త హైకోర్టు భవనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 08:05 PM

తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం నూతన హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును డీఈసీ ఇన్ ఫ్రా సంస్థ దక్కించుకుంది. కాగా, కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రూ.2,583 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇస్తూ గత ఏడాది డిసెంబరులో లా సెక్రటరీ తిరుపతి జీవో జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలవగా.. ఎన్సీసీతో పాటు డీఈసీ మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. కమిషనర్ ఆఫ్ టెండర్స్‌లో డీఈసీ అర్హత సాధించి ఈ కాంట్రాక్టును పొందింది.


సివిల్ పనుల కోసం రూ.1,980 కోట్లు, ఫర్నిచర్‌తో పాటు ఇతర ఖర్చుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జీఎస్టీ మినహాయించి రూ.1,443 కోట్లకు టెండర్ పిలవగా.. డీఈసీ 4.95 శాతం ఎక్కువకు కోట్ చేసి టెండర్ దక్కించుకుందని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు వెల్లడించారు. డీపీఆర్ ఖరారు బాధ్యతలను వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించగా, ఆ సంస్థ పలు డిజైన్లను సిద్ధం చేసింది. ఈ డిజైన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని జడ్జిల కమిటీ ముందు కన్సల్టెన్సీ, ఆర్‌అండ్‌బీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. కమిటీ ఒక డిజైన్‌ను ఖరారు చేసింది.


కొత్త హైకోర్టు భవన సముదాయంలో ప్రధాన కోర్టు భవనం ఆరు అంతస్తుల్లో 8.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి బంగ్లా, జడ్జిల క్వార్టర్లు, స్టాఫ్ కోసం నివాసాలు, అడ్మిన్ బ్లాకులు, రికార్డుల భద్రతకు ప్రత్యేక బ్లాకులు, బార్ కౌన్సిల్ బిల్డింగ్, అడ్వకేట్లకు లైబ్రరీ, 42,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆడిటోరియం వంటివి ఉంటాయి. సుమారు 3 వేల బైకుల పార్కింగ్, 1500 కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. మొత్తం 40 భవనాలను నిర్మించనున్నారు.


ప్రస్తుతం హైకోర్టులో 29 మంది జడ్జిలు ఉండగా, భవిష్యత్తులో జడ్జిల పోస్టులు పెరిగే అవకాశం ఉన్నందున 60 మంది జడ్జిలకు సరిపోను కోర్టు హాళ్లను కొత్త భవనంలో నిర్మించనున్నారు. కోర్టుకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తుల్లో 1.63 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పచ్చదనం ఉట్టిపడేలా గ్రాస్ ల్యాండ్‌ను ఏర్పాటు చేసి, చెట్లు, మొక్కలు నాటనున్నారు. ఈ నూతన హైకోర్టు భవన నిర్మాణం తెలంగాణ న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని అధికారులు అంటున్నారు. కాగా, తెలంగాణ కొత్త సెక్రటేరియట్ దాదాపు రూ.600 కోట్లతో నిర్మించగా.. అంతగు నాలుగింతల వ్యయంతో కొత్త హైకోర్టు భవనం నిర్మించేందుకు సిద్ధమయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa