ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మే ముఠా అరెస్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 06:34 PM

కళ్ళముందు ఆడుకుంటున్న చిట్టితల్లి లేదా బుజ్జి కొడుకు ఒక్కసారిగా కనపడకపోతే ఏ తల్లిదండ్రుల గుండె చెరువవదు..? ఆ క్షణం భూమి బద్దలైనట్లు, ఆకాశం విరిగిపడినట్లు అనిపిస్తుంది. ఆందోళనతో కూడిన భయం, తమ బిడ్డ క్షేమంగా ఉన్నాడా లేదా అనే తపన, నిస్సహాయతతో కూడిన ఆవేదన.. ఈ భావాలను వర్ణించడం అసాధ్యం. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది.


తమ చిట్టితల్లి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ, ప్రతి అలికిడికీ ఉలిక్కిపడుతూ, తమ బిడ్డ గురించే తలచుకుంటూ, క్షణ క్షణం నరకం చూస్తారు తల్లిదండ్రులు. వారి బాధను మాటల్లో చెప్పలేం. ఒక బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డ పెరుగుదలను చూస్తూ తమ జీవితంలో సర్వస్వం అని భావిస్తున్న వారికి, ఆ బిడ్డ కనపడకపోతే కలిగే మానసిక క్షోభ చెప్పేది కాదు. అది కేవలం వ్యక్తిగత విషాదం కాదు.. ఒక కుటుంబ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే గాయం.


 ఇలా శిశువులను కిడ్నాప్ చేస్తూ తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగుల్చుతున్న ఓ ముఠాను సూర్యాపేట పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి పసిపిల్లలను కిడ్నాప్ చేసి, వారిని భారీ మొత్తాలకు అమ్ముతున్న ఈ ముఠాలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న 16 నెలల బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. ఒక్కో శిశువును రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఈ ఘటన దేశవ్యాప్తంగా పసిపిల్లల అక్రమ రవాణా ఎంత భయంకరంగా జరుగుతుందో కళ్ళ ముందు నిలబెట్టింది. నిస్సహాయులైన తల్లిదండ్రుల ఆవేదనను సొమ్ము చేసుకుంటున్న ఇలాంటి అసాంఘిక శక్తులు సమాజానికి పెను ముప్పుగా మారుతోంది. ఆర్థిక అవసరాలు, నిరక్షరాస్యత, అవగాహన లేమి వంటివి ఇలాంటి ముఠాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల పిల్లలు సులభంగా లక్ష్యంగా మారుతున్నారు.


ఇలాంటి హృదయ విదారక సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమ పిల్లలు కిడ్నాప్‌లు లేదా అక్రమ రవాణాకు గురికాకుండా ఉండాలంటే కఠినమైన నిబంధనలు అవసరమని తల్లిదండ్రులు బలంగా వాదిస్తున్నారు. పసిబిడ్డల భద్రతకు సంబంధించి ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాలని.. చట్టాలను మరింత పటిష్టం చేయాలని, వాటి అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


పోలీసులు, చట్ట అమలు సంస్థలు అప్రమత్తంగా ఉంటూ, ముఠాలపై ఉక్కుపాదం మోపాలని.. నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి కఠిన చర్యల ద్వారానే తమ బిడ్డలకు పూర్తి భద్రత లభిస్తుందని, భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులూ తమ పిల్లల కోసం కన్నీరు పెట్టాల్సిన అవసరం ఉండదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa