ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 06:10 PM

గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచింది. పోలీసులు నిరంతరం దాడులు చేస్తూ.. అక్రమంగా గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకుంటున్నారు. అయినా రాష్ట్రంలోకి డ్రగ్స్, గంజాయి చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉంది. గత కొన్ని నెలలుగా పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. పట్టుబడిన వారిలో స్థానిక డీలర్లతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా చేసేవారు కూడా ఉన్నారు. రవాణాదారులు తమ పద్ధతులను మార్చుకుంటూ, కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. విద్యాసంస్థలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగుతోంది.


తాజాగా.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తుండగా సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ ఉండటం సంచలనంగా మారింది. వీరు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్‌పల్లికి ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్, తిరుపతి రూరల్‌కు చెందిన ఉన్నం సురేంద్ర, బాపట్ల జిల్లాకు చెందిన దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి , అద్దంకి మండలానికి చెందిన చెగుడు మెర్సీ మార్గరెట్, షేక్ మస్తాన్ వలీ , దేవరాజు యేసుబాబు ఉన్నారు.


కానిస్టేబుల్ గుణశేఖర్ వద్ద నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఓటీ అధికారులు తెలిపారు. వీరంతా గత కొద్ది రోజులుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి నెట్‌వర్క్‌ను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే సమాజంలో గౌరవ ప్రదమైన పోలీస్ ఉద్యోగంలో ఉన్న గుణశేఖర్ ఇలాంటి పని చేయటంపై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో మరోసారి రుజువు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa