ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో భారీ శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:16 PM

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి.. సౌకర్యాన్ని మెరుగుపరచడానికి దక్షిణ మధ్య రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ముఖ్యమైన రైళ్ల సర్వీసులను పొడిగించడంతో పాటు, కొన్ని రైళ్లకు అదనంగా స్లీపర్ కోచ్‌లను జత చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వేలాది మంది ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలగనుంది. ట్రైన్ నంబర్లు 12785, 12786 తో నడిచే కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్ రైలును ఇప్పుడు మైసూరుకు బదులుగా అశోకపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మార్పు వల్ల కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాలకు తెలంగాణ నుంచి రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అశోకపురం వరకు పొడిగించడం వలన దూర ప్రాంత ప్రయాణికులకు ప్రత్యక్ష రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి.


అదనపు స్లీపర్ కోచ్‌లు..


సెప్టెంబర్ చివరి వారం వరకు అధిక రద్దీని ఎదుర్కొనే రైళ్లకు అదనపు రెండవ తరగతి స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నారు. ఈ కోచ్‌లు ముఖ్యంగా హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై, సికింద్రాబాద్-భువనేశ్వర్ మార్గాల్లో నడిచే రైళ్లకు అందుబాటులోకి వస్తాయి.


హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై రైళ్లు..


ట్రైన్ నంబర్ 22731 (హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై)కి సెప్టెంబర్ 23న అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను జత చేస్తారు. ట్రైన్ నంబర్ 22732 (సీఎస్‌టీ ముంబై-హైదరాబాద్)కి సెప్టెంబర్ 26న అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను జత చేస్తారు. ట్రైన్ నంబర్ 12701 (సీఎస్‌టీ ముంబై-హైదరాబాద్)కి సెప్టెంబర్ 24న అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను జత చేస్తారు. ట్రైన్ నంబర్ 12702 (హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై)కి సెప్టెంబర్ 25న అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను జత చేస్తారు.


సికింద్రాబాద్-భువనేశ్వర్ రైళ్లు..


ట్రైన్ నంబర్ 17016 (సికింద్రాబాద్-భువనేశ్వర్)కి సెప్టెంబర్ 23న అదనంగా మూడు స్లీపర్ కోచ్‌లను జత చేస్తారు. ట్రైన్ నంబర్ 17015 (భువనేశ్వర్-సికింద్రాబాద్)కి సెప్టెంబర్ 25న అదనంగా మూడు స్లీపర్ కోచ్‌లను జత చేస్తారు. దీంతో పాటు..


ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని.. 19 ప్రత్యేక రైళ్ల సర్వీసులను కూడా దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. దీనిలో భాగంగా.. తిరుపతి-సాయినగర్ షిరిడీ (ట్రైన్ నంబర్ 07637).. ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 28 వరకు (ఆదివారం నాడు) 18 సర్వీసులు పొడిగించబడ్డాయి.


సాయినగర్ షిరిడీ-తిరుపతి (ట్రైన్ నంబర్ 07638).. ఆగస్టు 4 నుండి సెప్టెంబర్ 29 వరకు (సోమవారం నాడు) 18 సర్వీసులు పొడిగించబడ్డాయి. ధర్మవరం-సోలాపూర్ (ట్రైన్ నంబర్ 01438) ప్రత్యేక రైలు సర్వీసును కూడా పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయాలన్నీ రైళ్లలో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు మెరుగైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించే లక్ష్యంతో తీసుకున్నవి. ప్రయాణికులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa