బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించిన కేటీఆర్కు క్యారెక్టర్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీపై ఇలా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. "వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మీకు థర్డ్ క్లాస్ పార్టీగా, చిల్లర పార్టీగా కనిపిస్తోందా ఆ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా అని నిలదీశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలను కేటీఆర్ మరిచిపోయారా అని ధ్వజమెత్తారు.తెలంగాణ రాకపోయి ఉంటే కేటీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. "సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అమెరికాలో జీతం మీద బతికేవారు. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండేది కాదు" అని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు లేనిది, ఇప్పుడు కాంగ్రెస్ చిల్లర పార్టీగా ఎందుకు కనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు.పదేళ్లు మంత్రిగా పనిచేసినా కేటీఆర్కు రాజకీయ పరిణతి రాలేదని, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఆయన తాత, నానమ్మ బతికి ఉంటే ఇలాంటి మాటలకు చెంప మీద కొట్టేవారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన దీక్ష కూడా నాటకంలో భాగమేనని ఆయన ఆరోపించారు. తాను సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను సమీక్షలు చేస్తానని, వాటిని ఆపేది లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa