తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మరింత ఉధృతమవుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. వచ్చే 12 గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అధికారులు తక్షణ సన్నద్ధతతో ఉండాలని సూచించారు. రెడ్ అలర్ట్తో పాటు.. కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాబోయే గంటల్లో గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు, గ్రామీణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రవాహాలు పెరగడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అవసరమైతే అధికారులు రక్షణ చర్యలు చేపట్టేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ సహా అనేక పట్టణాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమవడంతో ట్రాఫిక్ అంతరాయం, డ్రైనేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పంట కోత సీజన్లో ఉండటంతో రైతులు తడిసి పోయే ధాన్యం, పత్తి వంటివి సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. పౌరులు వర్ష సమయంలో బయటకు వెళ్లకుండా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణించాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.
అప్రమత్తత అవసరం..
వ్యవసాయ పనులు చేసే కూలీలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు మూడు రోజులు వ్యవసాయ పనులను వాయిదా వేసుకుంటేనే సురక్షితం అని వాతావరణ శాఖ అధికారులే పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడం ఉత్తమం అని.. చెరువులు, వాగులు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa