ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎన్ని ఓట్లతో ఓడిపోతుంది.. రాజాసింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 08:15 PM

జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎన్ని ఓట్లతో ఓడిపోతుంది.. కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు(ఫోటోలు- Samayam Telugu)


ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా కాకరేపుతోంది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్స్ రాగా.. సిట్టింగ్ టికెట్‌ను బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ.. యువ నేత నవీన్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. అయితే బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం మొదలైనా కమలం పార్టీ మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో.. ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. కాషాయపార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు.


ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డిని టార్గెట్‌గా చేస్తూ రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతోపాటు మొత్తం తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీని గెలిపిస్తారా లేక కాంగ్రెస్‌ని గెలిపిస్తారా అనే ప్రశ్నలు ప్రజల నుంచి సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయని రాజాసింగ్.. కిషన్ రెడ్డిని ఎద్దేవా చేశారు.


జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని తెలిపిన రాజాసింగ్.. దానికి ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి గౌరవం ప్రమాదంలో ఉందని.. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే.. కేంద్ర పెద్దల ముందు మీ ముఖాన్ని ఎలా చూపిస్తారని.. కొద్దిగా ఆలోచించారా అంటూ ఘాటుగానే కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.


ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం, ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్, ప్రతి డివిజన్‌లో వేలు పెట్టే అలవాటు మీకు ఉందని.. కానీ ఈసారి జూబ్లీహిల్స్‌లో చాలామంది వేలు పెడుతున్నారని మండిపడ్డారు. తన జిల్లాను సర్వనాశనం చేసి.. తనను బీజేపీ పార్టీ నుంచి బయటికి పంపించారని.. ఒక రోజు మీరు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొవచ్చని కిషన్ రెడ్డిని రాజాసింగ్ హెచ్చరించారు. ఇక ఇప్పటికే తమ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎవరు పోటీ చేస్తారు అనేది ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న బీజేపీకి.. రాజాసింగ్ ఎపిసోడ్ మరింత ఇరుకున పడేలా చేస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa