ఈ నేల మీద స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న అఘాయిత్యాలు చూస్తే, అసలు మనం మానవ సమాజంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. పుట్టినింటికి, మెట్టినింటికి భారమైపోకుండా.. జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడే మహిళలు కూడా మానవ మృగాల బారిన పడుతుండటం తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా మహిళల అభద్రతను ప్రతిబింబిస్తోంది.
రౌడీ షీటర్ దాష్టీకం..
ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం, వి. వెంకటాయపాలెం పంచాయితీలోని జగ్యాతండాకు చెందిన బోడ సుశీల (28) రౌడీషీటర్ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఆ కుటుంబంలో, తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశీల పత్తి తీసే పని కోసం సమీప అమ్మపాలెం గ్రామానికి వెళ్ళింది. వారింటికి ఎదురుగా ఉండే రౌడీషీటర్ ధరావత్ వినయ్ పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్ళి.. తన కోరిక తీర్చాలని వేధించాడు.
ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో.. కలిసి ఉన్న మరో మహిళా కూలీ ఎదురుగా ఉండగానే దాడికి పాల్పడ్డాడు. మృతురాలి భర్త శివకుమార్ చెప్పిన దాని ప్రకారం.. చేను వద్దనే సుశీలను తీవ్రంగా కొట్టి, తన కారులో బలవంతంగా ఎక్కించుకుని వైరా వరకు తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత తనికెళ్ల వద్ద దింపి పారిపోయాడు. ఈ దాడి, అవమానం తట్టుకోలేని సుశీల, ఇంటికి వచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సుశీల మృతి సాధారణమైనది కాదని, వినయ్ వేధింపులు, దాడి కారణంగానే ఆత్మహత్య చేసుకుందని భర్త శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మృతురాలి అత్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమ కోడలి మరణానికి కారణమైన వినయ్ను కఠినంగా శిక్షించాలని కోరింది. సుశీల శరీరంపై గాయాలు ఉన్నాయని.. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఖమ్మం సర్వజనాసుపత్రి ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు.
రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం నిందితుడు వినయ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వినయ్పై నెల రోజుల క్రితమే రౌడీషీట్ తెరిచారు.
సమాజంలో భద్రత ఎక్కడ..?
ఆడపిల్లల పట్ల కొందరు మానవ మృగాళ్లులా ప్రవర్తిస్తున్న ఈ సమాజంలో మహిళలకు భద్రత కరువవుతోంది. కుటుంబ బంధాలు, విలువలు మరిచిపోయి.. వివాహేతర సంబంధాలకు అడ్డువస్తున్నారని భార్యలనే హత్య చేస్తున్న దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో భర్త భార్యను చంపి, ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన ఈ మానవత్వపు పతనానికి ఉదాహరణగా నిలుస్తోంది. మహిళలను కేవలం బానిసలుగా భావించి, వారి హక్కులను కాలరాస్తున్న పురుషులు ఎక్కువవుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సి బాధ్యత ప్రభుత్వం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa