ఏళ్ళ తరబడి తమ నిత్య జీవితంలో భాగమైన ఒక నిర్మాణం కళ్లెదుటే కూలిపోవడం స్థానిక ప్రజలకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తుంది. హైదరాబాద్ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాల(40 ఏళ్లు) పాటు రెండు ప్రాంతాల మధ్య వారధిగా ఉన్న పాత మూసారాంబాగ్ వంతెన విషయంలో ఇదే జరిగింది. అది కేవలం వంతెన మాత్రమే కాదు.. అనేక జ్ఞాపకాలకు, అనేక ప్రయాణాలకు సాక్షిగా నిలిచిన చరిత్ర. ఇక ఆ పాత వంతెన కనపించదనే ఆలోచన స్థానికులను కలవరపరిచింది. అంతే కాకుండా.. కొంత మంది బ్రిడ్జి కూల్చివేత పనులను ఆపాలని.. కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాతనే కూల్చివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మూసారాంబాగ్ వంతెన ప్రస్థానం ముగింపు..
హైదరాబాద్ మహానగరానికి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించిన పాత మూసారాంబాగ్ వంతెనను ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. అంబర్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను కలుపుతూ మూసీ నదిపై నిర్మించిన ఈ వంతెన కూల్చివేత పనులు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
గతంలో నగరంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ మూసీ నది ఉప్పొంగి, ఈ పాత వంతెన మునిగిపోయేది. ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా వంతెన కోతకు గురైంది. సుమారు 40 ఏళ్లుగా నగర ప్రజలకు సేవలు అందించిన ఈ వంతెన, నిరంతర వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిపుణులు పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదించారు. వాహనాల రాకపోకలకు వంతెన సురక్షితం కాదని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు తేల్చడంతో.. కూల్చివేత అనివార్యమైంది.
కొత్త వంతెన నిర్మాణం..
పాత వంతెన కూల్చివేతతో.. ఆ స్థానంలో నిర్మిస్తున్న కొత్త హై లెవెల్ వంతెన పనులను వేగవంతం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా జూన్ నాటికి కొత్త వంతెన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు కమిషనర్ ఆర్.వి. కర్జన్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త వంతెన వరదలు వచ్చినప్పటికీ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉపయోగపడుతుంది. ఈ నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి .. అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయంగా గోల్నాక వంతెనపై నుంచి ప్రయాణించాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa