ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు,,,, చరిత్రలో ఇదే తొలిసారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 07:18 PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈసారి అనూహ్య రాజకీయ, సామాజిక పరిణామాలకు వేదికగా మారింది. సాధారణ ఎన్నికలను తలదన్నే విధంగా నవంబర్ 11న జరగబోయే ఈ పోలింగ్‌లో తుది జాబితా ఖరారయ్యేసరికి ఏకంగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలవడం నియోజకవర్గ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైనప్పటికీ.. ప్రధాన పార్టీల మధ్య పోరు కంటే.. స్వతంత్రులు, వివిధ సామాజిక వర్గాల తరపున నామినేషన్లు దాఖలు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.


గత ఎన్నికల సరళితో పోలిస్తే.. ఈ ఉప ఎన్నికలో అభ్యర్థుల సంఖ్య అమాంతం పెరిగింది. 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికలో మొత్తం 13 మంది, 2014లో 21 మంది, 2018 సాధారణ ఎన్నికలో 18 మంది, 2023లో 19 మంది బరిలో నిలిచారు. ఈ సారి మొత్తం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 81 మంది అర్హత సాధించారు. వారిలో 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో నిలిచారు. ఇంత మంది బరిలో ఉండటం వల్ల ఓటర్ల చీలిక, ఎన్నికల ఫలితంపై స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రధాన పార్టీలను కలవరపెడుతున్న అంశం.


సాధారణంగా ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల బలాబలాలు మాత్రమే చర్చనీయాంశమవుతాయి. కానీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడానికి వెనుక ఉన్నత స్థాయి రాజకీయ లక్ష్యాలు కంటే.. సామాజిక నిరసన, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ నిర్వాసితులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. తమకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ 12 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. తగిన పరిహారం ఇవ్వలేదని, తమ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు.


ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం తరఫున 10 మంది నామినేషన్లు వేశారు. ఉద్యోగ నియామక ప్రకటనలు లేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది యువకులు తమ నామినేషన్ల దాఖలు చేశారు. పింఛన్లు సక్రమంగా రావడం లేదని నిరసిస్తూ సీనియర్ సిటిజన్ల తరఫున 9 మంది రంగంలో ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం శాసనసభలో ఒక సీటును నిర్ణయించడమే కాకుండా.. ప్రభుత్వ ప్రజాకర్షణపై ఒక నైతిక తీర్పుగా కూడా మారే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa