ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో గర్భిణులు, బాలింతలకు ఆర్థిక చేయూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 07:28 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా మహిళలకు ఆర్థికంగా సాయం అందించనున్నారు. ఇంతకు ఇది ఏ పథకం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోన్న ప్రధాన మంత్రి మాతృ వంజన యోజన పథకం. దీన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఆ వివరాలు..


కేంద్ర ప్రభుత్వం గర్భవతులు, బాలితంతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకాన్ని అమలు చేస్తుంది. అయితే దీన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు రూ.5 వేలు సాయం చేస్తుంది. తొలి కాన్పుకు ఈ మొత్తం అందజేస్తారు. అలానే రెండో సారి ఆడపిల్ల పుడితే మరో 6 వేల రూపాయలు అందజేయనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతలను తెలంగాణ రాష్ట్రంలోని శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షించనున్నది.


 ఈ పథకం అమలుకు సంబంధించి ఇటీవలే స్టేట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపింది. ఈ స్కీమ్ ద్వారా తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు 3 విడుతల్లో రూ. 5 వేల ఆర్థిక సహాయం అందిస్తారు. దీనికోసం గర్భం దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ముందుగా రూ.1000 ఇస్తారు. ఆ తర్వాత గర్భం దాల్చిన 6 నెలల తర్వాత రెండో విడత కింద రూ. 2వేలు.. బిడ్డ పుట్టిన తర్వాత మొదటి దశ టీకాలు వేయించగానే మూడో విడత కింద రూ. 2 వేలు నేరుగా లబ్ధిదారు బ్యాంకు అకౌంట్‌‌‌‌లో జమ చేస్తారు.


రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే... ఆ తల్లికి ఒకేసారి రూ.6 వేలు అందజేస్తారు. దేశంలో ఆడపిల్లల సంఖ్యను పెంచడం, భ్రూణ హత్యలను నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆధ్వర్యంలో.. అంగన్‌వాడీ కార్యకర్తలు అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తారు. వారి పేర్లు నమోదు చేయడం.. విడతల వారీగా వారికి నగదు అందించడం వంటి బాధ్యతలను వీరే నిర్వహిస్తారు.


కేంద్ర ప్రభుత్వం 2017 లో ఈ పీఎంఎంవీవైను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా చాలా వరకు రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. కానీ తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదు. ఈక్రమంలో ఈ పథకం కింద ప్రతి ఏటా కేంద్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల నిరుపేద గర్భిణులు, బాలింతలకు లబ్ధి చేకూరుతుందనే భావిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa